ప్రధాని వస్తున్నారని తెలిసి పారిపోయిన కేసీఆర్.!మోదీని చూసి సీఎం వణికిపోతున్నారన్న బండి సంజయ్.!
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు వింటేనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గజ గజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిసినా, మొఖం చెల్లక చంద్రశేఖర్ రావు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో చనిపోయిన రైతులకు చంద్రశేఖర్ రావు ఆర్దిక సాయం చేయడంపై తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వేలాది మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా చివరకు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా.. ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని బండి సంజయ్ మండి పడ్డారు.
ఎంతో మంది రాష్ట్ర రైతుల ఆత్మహత్యలు..
అకాల వర్షాలతో పంట నష్టపోయి వడ్ల కుప్పలపై పడి రైతులు గుండె పగిలి చనిపోయారన్నారు. అలాంటి కుటుంబాలకు ఏనాడూ నయాపైసా సాయం చేయని చంద్రశేఖర్ రావు పబ్లిసిటీ కోసం ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్దిక సాయం చేస్తుండటం సిగ్గు చేటన్నారు. సీఎం తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నేతలతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
వేలాది మందితో మోదీకి అపూర్వ స్వాగతం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలన్నారు బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభ విజయవంతం కావడంతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల పనితీరుపై పార్టీ జాతీయ కార్యవర్గాల్లో చర్చకు వచ్చిందని, ఈ నేపథ్యంలో ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున కనీవినీ ఎరగని రీతిలో అపూర్వ స్వాగతం పలకాలన్నారు బండి సంజయ్. అవినీతి మచ్చలేని ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారని తెలిసి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గజగజ వణికిపోతున్నడని, ఆయనకు ముఖం చూపించే ధైర్యం లేక పారిపోతున్నడని, గతంలో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన సమయంలోనూ చంద్రశేఖర్ రావు ఇదే విధంగా తప్పించుకున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ అసభ్య పదజాలం..
అంతే కాకుండా చంద్రశేఖర్ రావు తనయుడు,మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న అసభ్య భాష, వ్యవహరిస్తున్న తీరును చూసి టీఆర్ఎస్ పనైపోయిందని జనం చర్చించుకుంటున్నారని, కేటీఆర్ సైకోలా మారిండని జనమే ఛీ కొడుతున్నారన్నారు బండి సంజయ్. చంద్రశేఖర్ రావు పబ్లిసిటీ కోసం, ప్రజల చర్చను దారి మళ్లించేందుకు ఇతర రాష్ట్రాల రైతులకు ఆర్దిక సాయం చేస్తున్నట్లు పోజులిస్తున్నారని, కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మందికిపైగా నిరుపేదలు చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని పలకరించలేదని బండి సంజయ్ గుర్తు చేసారు.
నగరం కాషాయమయం కావాలి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్నందున ఎయిర్ పోర్టు నుండి గచ్చిబౌలి వరకు ఆయన వెళ్లే మార్గంలో కనీవినీ ఎరగని రీతిలో వేలాది మందితో అపూర్వ స్వాగతం పలకాలన్నారు బండి సంజయ్. రాజధాని యావత్తు హోర్డింగులు, ఫ్లెక్సీలతో కాషాయ మయం చేయాలని, అందుకోసం ప్రతి డివిజన్ లో సమావేశం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలంతా మోదీకి స్వాగతం పలికేలా సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, కార్పొరేటర్లు మాట్లాడుతూ మోదీకి అపూర్వ స్వాగతం పలికేందుకు తమ తమ జిల్లాలు, డివిజన్ల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలను సమీకరిస్తామన్నారు.