పోయేకాలం దాపురిస్తే ఇలానే.. బండి సంజయ్ రైతుల కోసం పోరాటం చేస్తే కేసులు పెడతారా?
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బిజెపి నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు తో కేసు నమోదు చేయడం దుర్మార్గం అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి 8 పేర్కొన్నారు. బండి సంజయ్ పై కేసుల నమోదును తీవ్రంగా ఖండించిన రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తాజాగా పెట్టిన కేసులతో కేసీఆర్ సర్కార్ మరోసారి రైతు వ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకుందన్నారు.
రైతుల పక్షాన పోరాటం చేస్తే... కేసులు నమోదు చేస్తారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు... పోయేగాలం దాపురిస్తే, ఇలానే కేసులు నమోదు చేస్తారని కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎన్వీ సుభాష్ విమర్శించారు. రైతుల ఉసురు తీసుకుంటూ... కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తోందని ఆయన ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు పంటలు పండే భూములను.. పారిశ్రామిక జోన్ కోసం లాక్కొని, వ్యాపారులకు అప్పగించడం దారుణం అని ఎన్ వి సుభాష్ మండిపడ్డారు. ఎద్దేడ్చిన వ్యవసాయం... రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రా... లేక రియల్ ఎస్టేట్ మినిస్టరా? ఆయన ప్రశ్నించారు. రైతులతో పెట్టుకున్న మీకు ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నిరసన ప్రదర్శన చేపట్టడం సర్వసాధారణం అని పేర్కొన్న ఎన్ వి సుభాష్ తెలంగాణ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిరంతరం నిరసన ప్రదర్శనలు, పోరాటాలు చేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. నిరసన ప్రదర్శన చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పై ఏ వన్ గా నమోదు చేయడం రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేసులతో రాజకీయ పార్టీలను బెదిరించాలనే ప్రయత్నం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందన్నారు ఎన్ వి సుభాష్.