'గ్రేటర్' ఎత్తుగడ: చంద్రబాబుకు కెసిఆర్ 'మీడియా' కౌంటర్
హైదరాబాద్: రాజకీయ వ్యూహంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కన్నా రెండాకులు ఎక్కువే చదివినట్లున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఓ వైపు చంద్రబాబు నాయుడు ప్రచారం సాగిస్తుండగా కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
మీడియా సమావేశంలో కెసిఆర్ సుదీర్ఘంగా దాదాపు రెండు గంటలు మాట్లాడారు. దాంతో తెలుగు న్యూస్ చానెల్స్ కెసిఆర్ మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. రామోజీరావుకు చెందిన ఈటీవీ తెలంగాణ చానెల్ కూడా ఆయన మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీంతో చంద్రబాబు ప్రచారాన్ని చూపించలేకపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి దక్కే ప్రచారం కన్నా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు ఎక్కువ ప్రచారం లభించింది.
కూటమి గెలుపు ఖాయం: గ్రేటర్లో ఏపి మంత్రుల ప్రచారం(పిక్చర్స్)
నిజానికి, కెసిఆర్ బుధవారం మూడు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండింది. అయితే, దాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నారు. జలుబు కారణంగా, కార్యక్రమాల ఒత్తిడి వల్ల బుధవారంనాటి మీడియా సమావేశం వాయిదా పడినట్లు చెప్పారు. కానీ, అసలు విషయం చంద్రబాబు ప్రచారంపై తనది పైచేయి కావాలనే ఉద్దేశంతో వాయిదా వేసుకున్నట్లు భావిస్తున్నారు.
శుక్రవారంనాటి ప్రింట్ మీడియాలో కూడా చంద్రబాబు ప్రచారానికన్నా తాను మాట్లాడిన విషయాలకే ప్రాధాన్యం ఉంటుందనే విషయం కెసిఆర్కు తెలుసు. కెసిఆర్ను కాదని చంద్రబాబుకు ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి హైదరాబాద్ నుంచి వెలువడే పత్రికల్లో ఉండదు. టిడిపికి అనుకూలంగా వ్యవహరించే పత్రికలు బ్యాలెన్స్ చేస్తున్నట్లు పక్కపక్కనైనా ప్రచురించవచ్చు గానీ చంద్రబాబు మాత్రమే మొత్తం మీడియాను ఆక్రమించకుండా కెసిఆర్ జాగ్రత్త పడ్డారని అనుకుంటున్నారు.
కాగా, చంద్రబాబు శుక్రవారంనాడు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ప్రచారం చేయనున్నారు. అయితే, జనవరి 30వ తేదీన జరిగే బహిరంగ సభలో కెసిఆర్ ప్రసంగిస్తారని అంటున్నారు. శుక్రవారం చంద్రబాబు మాట్లాడే విషయాలకు సమాధానం ఇవ్వడానికి వెసులుబాటు చిక్కడమే కాకుండా ప్రచారాన్ని తాను ముగించడం ద్వారా మీడియాలో తానే ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తొడ కొట్టడానికి బాలకృష్ణ సినిమాలు కావు: మీట్ ది ప్రెస్లో కవిత, రోడ్షో(పిక్చర్స్)
హైదరాబాద్ ప్రజలకు తాను చేసిందేమిటి, చేయబోయేది ఏమిటనేది కెసిఆర్కు మీడియా సమావేశంలో చాలా వెసులుబాటు దక్కింది. ఇప్పటి వరకు తెలుగుదేశం, కాంగ్రెసు, బిజెపిలు చేసిన విమర్శలను తిప్పికొట్టడానికి ఆయనకు మీడియా సమావేశంలో వీలు చిక్కింది.
పైగా, చంద్రబాబు కెసిఆర్పై విమర్శలు చేసే స్తితిలో లేరు. కానీ, కెసిఆర్ చంద్రబాబును తిప్పికొట్టడానికి ఏ మాత్రం వెనకాడలేదు. చంద్రబాబు అమరావతికే దిక్కులేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో చంద్రబాబు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. స్మార్ట్ సిటీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే అవకాశాన్ని కూడా కెసిఆర్ తీసుకున్నారు.