కొడంగల్కు కేసీఆర్ చేసిన అన్యాయమిదీ, పౌరుషం చూపిస్తా: చార్లెస్ శోభరాజ్ అంటూ రేవంత్ రెడ్డి
కొడంగల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కు కొడంగల్లో అడుగు పెట్టే హక్కు లేదని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తమ నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. కొడంగల్కు కృష్ణా నది నుంచి నీళ్లు తెస్తానని పెద్దపెద్ద పైపులు వేశారని చెప్పారు. పైపులు వేశారు కానీ నీరివ్వడం మరచిపోయారని చెప్పారు. మిషన్ భగీరథలో మీ కమీషన్ల కక్కుర్తికి కొడంగల్ బలైందని చెప్పారు. కృష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ అటకెక్కిందన్నారు.
కేసీఆర్ దుర్మార్గమైన పాలన వల్ల కొడంగల్ ఎంతో నష్టపోయిందని చెప్పారు. తనను అడ్డుకోవడం ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సాధ్యం కాక కేసీఆర్ను ఈ నెల 4వ తేదీన రంగంలోకి దింపుతున్నారని చెప్పారు. ఈ కేసీఆర్ కొడంగల్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పారు. కొడంగల్ను హైటెన్షన్ తీగలా రక్షించుకుంటానని చెప్పారు. డిగ్రీ కాలేజీ నిర్మాణానికి వచ్చిన నిధులు మళ్లించి నియోజకవర్గాన్ని నిండి ముంచారన్నారు.
కొడంగల్కు ఎంత అన్యాయం చేశావంటే
ఐటీఐ కాలేజీకి పరిపాలనాపరమైన అనుమతులు కూడ మంజూరు చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్ను (కేసీఆర్) గెలిపించి పార్లమెంటుకు పంపించిన కొడంగల్ నియోజకవర్గానికి ఇంత అన్యాయం చేస్తావా అని కేసీఆర్ను నిలదీశారు. పార్లమెంటులో నోరెత్తకపోయినా, పాలమూరులో నువ్వు అడ్రస్ లేకపోయినా కొడంగల్ నిన్ను అక్కున చేర్చుకుందని చెప్పారు. అందుకే కొండగల్కు ఇంత అన్యాయం చేస్తున్నావా అని ప్రశ్నించారు.
అభివృద్ధిని అడ్డుకున్నారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం సమయంలో మీ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం అదే పట్నంకు ఓటు వేయమని అడిగేందుకు వస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అందుకే కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్నారన్నారు.
బిల్లా రంగాలకు చార్లెస్ శోభరాజ్ మద్దతు
వారి తీరి బిల్లా-రంగాలకు చార్లెస్ శోభరాజ్ మద్దతు పలుకుతున్నట్లుగా ఉందని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ఐటీ సోదాల్లో డబ్బు దొరికినప్పటి నుంచి నరేందర్ రెడ్డిపై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి గెలవాలనుకుంటున్న పట్నం సోదరులకు చార్లెస్ శోభరాజ్ ఎందుకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. తమ కార్యకర్తల ఇళ్లపై ప్రత్యేక పోలీసుల పేరుతో రాత్రి సమయాల్లో దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఇంత కక్షకట్టిన నిన్ను రానివ్వాలా?
ఇంట్లో భర్తలు లేని సమయంలో తమ నాయకుల ఇళ్లలోకి వెళ్లి వారి భార్యలను భయాందోళనకు గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఊళ్లో సభలు పెట్టుకున్నా వచ్చి తమ కార్యకర్తలను కొడుతున్నారన్నారు. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మాఫియా డాన్ కింద పని చేసే అనుచరుల్లా తెరాస నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కొడంగల్ పైన ఇంత కక్షకట్టిన నిన్ను ఇక్కడకు రానివ్వాలా అని ప్రశ్నించారు.
కేసీఆర్కు కొడంగల్ పౌరుషం చూపిస్తాం
కోస్గి సీఐ, బొమ్రాస్పేట ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ అభివృద్ధికి పట్నం సోదరులు అడ్డుపడ్డారని చెప్పారు. పనికిరాని పశువులను కొడంగల్ ప్రజల పైకి ఉసిగొల్పారన్నారు. కొడంగల్ ప్రజల పౌరుషాన్ని మూటలతో కొనుక్కోవాలని అనుకుంటున్నారని, ముఠాలతో కొడంగల్ ప్రజలను బెదిరించాలని అనుకుంటున్నారని, అధికారాన్ని, పెత్తనాన్ని తమపై రుద్దాలని చూస్తున్నారని, కానీ కేసీఆర్కు ధీటైన సమాధానం చెబుతామన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని, అప్పుడు రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. పేదలకు రూ.6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. కుటుంబానికి ఏడాదికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.