రేవంత్ అహంకారానికి హద్దుల్లేకుండా పోయాయి: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి అహంకారానికి హద్దులు లేకుండా పోయాయని.. ఆయనేం పడగొడుతాడో తెలియదన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా అశ్వారాపుపేట నియోజకవర్గం దమ్మపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లిచ్చామని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు వస్తూ పోతుంటాయని.. ప్రజలు మాత్రం ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలు అభ్యర్థుల మంచి, చెడుతోపాటు గుణం గురించి ఆలోచించాలన్నారు. అభ్యర్థుల వెనక ఉన్న పార్టీల చరిత్ర వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? అని ఆలోచించాలని కోరారు. 'ధరణి' కారణంగా రైతులకు రైతుబంధు డబ్బులు తమ తమ ఖాతాల్లో పడుతున్నాయన్నారు కేసీఆర్.

'ఇవాళ కాంగ్రెస్ బాధ్యతా రహిత్యంగా మాట్లాడుతున్నది. ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు. వస్తే వేస్తరనుకుందాం. వేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. గతంలో ప్రభుత్వంలో రూపాయి సాంక్షన్ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ? ఎంతమంది పైరవీకారులు ఉండేది ? ఈ రోజుల అట్ల లేదు' అని కేసీఆర్ చెప్పారు.
'పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు, మూడు, నాలుగుసార్లు చెబుతున్నడు. ఆయన అహంకారానికి హద్దులే లేవు. ఆయన ఏం పడగొడుతడో.. ఏం చేస్తడో నాకు తెల్వది కానీ.. ఆయనకు ఉన్న అవగాహన ఏంటో నాకు తెల్వదు. ఆయనకు తెలివి ఏంటో తెలియదు. నేను కూడా రైతునే. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. ఒకాయనేమో ఉత్తమ్కుమార్రెడ్డి. ఆయన చెబుతున్నడు. కేసీఆర్కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బంతా రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు కావాలంటే మెచ్చ నాగేశ్వర్రావు గెలవాలి' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వవచ్చని కాంగ్రెస్ నాయకుడెవ్వడూ ఆలోచించలే.. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం. 75 శాతం పూర్తయింది... ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మంలోని 10 నియోజకవర్గాలకు సమృద్ధిగా సాగునీరు వస్తది.
— BRS Party (@BRSparty) November 13, 2023
- బీఆర్ఎస్ అధినేత,… pic.twitter.com/jMjNEEIzt1
ధరణిని బంగాళాఖాతంలో వేస్తరటా.. రైతుబంధు దుబారనట.. ఇంకో మాట చెబుతున్నరు డేంజరస్గా. కరెంటు 24గంటలు వేస్ట్.. కేసీఆర్ డబ్బులన్నీ చెడగొడుతున్నడు.. మూడు గంటలు ఇస్తే సరిపోతది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే పనైతది. అందుకే నేను చెప్పేది. ఎవరి వైఖరి ఏంది.. ఏ పార్టీ ఏం చెబుతున్నది ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగమైపోతాం. మూడు గంటల కరెంటు పొలాలు పారుతాయా అంటూ రేవంత్, కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నీళ్లివ్వొచ్చని ఏ కాంగ్రెస్ నేతా గతంలో ఆలోచన చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందన్నారు. దీని నిర్మాణం ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందన్నారు. ఇప్పుడున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోరావాలని కేసీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications