తేల్చేసిన ఎల్.రమణ... కేసీఆర్తో భేటీ తర్వాత పార్టీ మార్పుపై ఏమన్నారంటే...
ముఖ్యమంత్రి కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ వెల్లడించారు. సామాజిక తెలంగాణ కోసం ముందుకు సాగాలన్న ఆలోచనను ఈ సందర్భంగా కేసీఆర్ తనతో చెప్పారని అన్నారు. ఇందుకోసం తనతో కలిసి రావాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. ఇందుకు సానుకూలంగా తన నిర్ణయం ఉంటుందని కేసీఆర్తో చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రగతి భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేసీఆర్తో భేటీ అయిన అనంతరం రమణ మీడియాతో మాట్లాడారు.
కారెక్కనున్న ఎల్.రమణ-ఇవాళ కేసీఆర్తో భేటీ-ఆ హామీ లభించాకే పార్టీ మార్పుపై ప్రకటన..?
కేసీఆర్తో భేటీ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు,ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్లు రమణ వెల్లడించారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... రమణ అంటే కేసీఆర్కు అభిమానమని చెప్పారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ టీఆర్ఎస్కు అవసరమని అన్నారు. రమణను కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని... అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ నిలబడే పరిస్థితి లేదన్నారు.
రమణ టీఆర్ఎస్లో చేరబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే పార్టీ మార్పుపై ఇంకా తాను ఏ నిర్ణయం తీసుకోలేదని గతంలో ఆయన వెల్లడించారు. తాజాగా కేసీఆర్తో భేటీ తర్వాత టీఆర్ఎస్లో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక త్వరలోనే ఆయన పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ పదవిపై కేసీఆర్ హామీ ఇవ్వడంతో రమణ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తాజా భేటీలో రమణను కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోవడంతో బీసీ వర్గానికి చెందిన బలమైన నేత పార్టీకి దూరమైనట్లయింది. ఒకరకంగా బీసీల్లోకి ఇది ప్రతికూల సంకేతాలు పంపిస్తుందోమోనన్న అనుమానం టీఆర్ఎస్లో కలిగింది. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజికవర్గానికే చెందిన ఎల్.రమణను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీల్లో కలిగిన అసంతృప్తిని దూరం చేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు రమణ కూడా టీడీపీలో ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతోనే టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.