తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. నేతల మద్య పంచాయతీలు..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఓ ప్రహసనంగా మారనున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పంచాయతీ ఎన్నికలను ఎట్టి పరిస్థితిలో నిర్వహించాలని పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. నాయకుల మూడ్ తో సంబందం లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకే ముఖ్యమంత్రి నిర్నయించుకున్నట్టు నిర్ధారణ అవుతోంది. ఎన్నికల కోసం పాటించాల్సిన అన్ని నియమాలను చకచక పాటిస్తూపోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
అదికార పక్ష నాయకులకు అగ్నిపరీక్షగా మారిన పంచాయతీ ఎన్నికలు..
పంచాయతీ ఎన్నికలు అధికార పక్షంలో దడపుట్టిస్తున్నాయా? సాధారణ ఎన్నికలకు ముందు ఎందుకొచ్చిన పంచాయితీ అని గులాబీ నేతలు తలలు పట్టుకుంటున్నారా? నాయకులు నై అంటున్నా పంచాయతీ ఎన్నికలకు ముఖ్యమంత్రి మాత్రం సై అంటున్నారా?అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. నేతల తీరు ఇలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మరోలా ఉంది. ఇంతకీ పంచాయతీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు, పార్టీ నేతల ఆందోళనకు మధ్య ఏం జరుగుతోంది? పార్టీ నేతల మనోభావాలకు విరుద్దంగా పంచాయతీ ఎన్నికలను గడువులోగా జరిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చకచకా పావులు కదుపుతుంటే నాయకులు మాత్రం తెల్లమొహాలేస్తున్నారు.
ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల పట్ల పారదర్శకత లేదంటున్న విపక్షాలు..
కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేశారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి విధివిధానాలను పేర్కొంటూ సర్క్యూలర్ జారీ చేశారు. దీనిపై విపక్ష కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది. బీసీ జనాభా గణన సరిగా జరగలేదన్నది ఆ పార్టీ వాదన. కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటోన్న పంచాయతీరాజ్ సంఘం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి కూడా కోర్టులో మరో పిటీషన్ వేశారు. రిజర్వేషన్ల ఖరారులో బీసీ, ఎస్సీలకు అన్యాయం జరుగుతోందన్నది ఆయన వేసిన పిటీషన్ సారాంశం. అయితే, సర్క్యూలర్ ఆధారంగా విచారణ సాధ్యం కాదని కోర్టు పేర్కొంది.
గ్రామ స్థాయిలో బలనిరూపణకు దోహదం చేసే ఎన్నికలు..
ఇక బీసీ జనాభా గణన విషయంలో మాత్రం ఏ ప్రాతిపదికను అనుసరించారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడదాం. టీఆర్ఎస్ నేతలు మాత్రం పంచాయతీ ఎన్నికలు జరగకపోతేనే బాగుండని ఆశిస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే భారీ ఎత్తున చేతి చమురు వదలడం ఖాయం అన్నది వారి ఆందోళన. సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరుగుతాయి. పార్టీ సింబల్ కూడా ఉండదు. అయినా, అంతిమంగా గ్రామాల్లో పార్టీల బలాబలాలు ఈ ఎన్నికలతోనే తేలిపోతాయి. అందుకే ఎక్కడా రాజీపడకుండా డబ్బు ఖర్చుచేయాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. పైగా గ్రామాల్లో చిల్లర తగాదాలు నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయి. మరో పది నెలల్లో సాధారణ ఎన్నికలకు వెళుతున్నవేళ పంచాయతీ ఎన్నికల్లో తేడా వస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల పై పడుతుంది.
గులాబీ నేతలకు పంటికిందరాయిలా పంచాయతీ ఎన్నికలు..
ఈ ఎన్నికల్లో అనుచర గణాన్ని అన్ని విధాలా సంతృప్తి పరిస్తే తప్ప, వచ్చే ఎన్నికల్లో వాళ్లు వీళ్ల పక్షాన నిలబడి పని చేయరు. కొన్ని సందర్భాలలో స్థానికంగా ప్రత్యర్థి పార్టీ నాయకుడు సర్పంచ్ గా గెలిచినా... నయానో భయానో అతడిని తమ ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఓ మహా క్రతువు... డబ్బులు వదలడంతో పాటు, అనేక చికాకులు - తలనొప్పులు చుట్టుముడతాయి. అందుకే టీఆర్ఎస్ నేతలు పంచాయతీ ఎన్నికలకు అంత సుముఖంగా లేరంటున్నారు. వారి మాట ముఖ్యమంత్రి ఎలాగూ వినే పరిస్థితి ఉండదు కనుక... కాంగ్రెస్ వేసిన పిటీషన్ల ఆధారంగా ఎన్నికలు వాయిదా పడటానికి కోర్టే మార్గం చూపిస్తే బాగుండన్న భావన చాలా మంది టీఆర్ఎస్ నేతల్లో ఉందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.