ఈ యాగం నిర్వహించే రెండో వ్యక్తి కెసిఆర్: 40 క్వింటాళ్ల నెయ్యి గుజరాత్ నుంచి
హైదరాబాద్: దేశంలో అయుత చండీయాగాన్ని నిర్వహించే రెండో వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రెండోవారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. దేశంలో ఇంతవరకు ఒక్కసారే ఈ యాగాన్ని నిర్వహించారని, అదీ శృంగేరి పీఠం సారథ్యంలో జరిగిందని, ఆ తర్వాత నిర్వహిస్తున్నది తాను మాత్రమేనని ఆయన అన్నారు.
కాకతీయుల కాలంలో యాగం నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఆధారాలు ఏమీ లేవని, అందువల్ల ఈ యాగం నిర్వహిస్తున్న రెండవ వ్యక్తిని తానేనని ఆయన చెప్పారు. తనకు తెలిసినంతవరకు ఇది సత్యమని ఆయన అన్నారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబోయే అయుత చండీయాగం వివరాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కొందరు ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడారు.
యాగానికి వచ్చేవారికి అయ్యే ఖర్చు తక్కువే గానీ యాగంకోసం చేసే ఏర్పాట్లకే ఎక్కువ ఖర్చు అవుతోందని ఆయన అన్నారు. యాగం నిర్వహించే రుత్విజులు ఎంతో నిష్టతో, పరమ పవిత్రంగా ఈ కార్యాన్ని నిర్వహిస్తారని, వారిని ఇతరులు తాకూడదని, అలా తాకినట్టు అయితే రుత్విజులు అందరూ స్నానమాచరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

యాగస్థలి వద్ద తాను కూడా ఒక కార్యకర్త మాదిరిగా నిర్వహకులు చెప్పినట్టు నడుచుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. మూడు రోజుల పాటు తాను కూడా ఉపవాస దీక్షను పాటించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. యాగం విజయవంతం అయితే లోకకల్యాణానికి, ప్రతి ఒక్కరి అభివృద్ధికి దోహదం చేస్తుందని, యాగ నిర్వహణలో ఏదైనా లోపం జరిగితే మాత్రం దాని ప్రతిఫలాన్ని సంకల్పం తీసుకున్నవారు అనుభవించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
యాగంలో సుమారు 400 క్వింటాళ్ల నెయ్యిని ఉపయోగిస్తారని, దీనిని తన మిత్రుడు ఒకరు గుజరాత్ నుంచి పంపిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications