సిగ్గులేదా?, ఇంకా ఇక్కడ ఎలగపెడతావా?: బాబుపై కేసీఆర్ నిప్పులు
‘చంద్రబాబు.. ఆంధ్రా రైతులకు, డ్వాక్రా మహిళలకు శఠగోపం పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి ఎలగబెడతడట.. వచ్చి గెలుస్తడట, సిగ్గులేకుండా వైజాగ్ మహానాడులో చెప్పుకున్నడు’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను 100కు 100 శాతం అమలు చేసి, రూ.17 వేల కోట్లతో పూర్తి స్థాయిలో రైతుల రుణమాఫీ చేసిందని, అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు రైతులను మోసం చేశాడని
'చంద్రబాబు.. ఆంధ్రా రైతులకు, డ్వాక్రా మహిళలకు శఠగోపం పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి ఎలగబెడతడట.. వచ్చి గెలుస్తడట, సిగ్గులేకుండా వైజాగ్ మహానాడులో చెప్పుకున్నడు' అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
అంతేగాక, 'మేం ఏం చెప్పాం చంద్రబాబూ.. మొట్ట మొదట నీ ఏపీ రైతులకు, డ్వాక్రా మహిళలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంది..?, అందరికీ మేలు చేస్తానన్నావు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు, మాఫీ చేస్తామన్నావు. మాట మార్చావు. తిమ్మిని బమ్మిని చేశావు. తెలంగాణలో నీకు స్థానం లేదు. నీ కథ ఇక్కడ సరిపోయింది. తెలంగాణకు వచ్చినా నీకు వచ్చేదేమి ఉండదు. నీకు డిపాజిట్లు కూడా రావు' అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
రాజీనామా చేయండి..
కాంగ్రెస్ నేతలకు ఆత్మవిశ్వాసం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని, ఎవరు గెలుస్తారో గోదాలోనే తేలుతుందని సిఎం కె చంద్రశేఖర్ రావు సవాల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలడాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలు, తమపై తమకు నమ్మకముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. ఎవరేమిటో? ఎవరు గెలుస్తారో అక్కడే తేలిపోతుందని అన్నారు.
మీ దిమాక్ లే బోగస్
‘సర్వేలు కాదు, మీ దిమాక్లే బోగస్' అని విపక్షాలపై కేసీర్ మండిపడ్డారు. మా సర్వే బోగస్ అయితే మోడీపై బీజేపీ సర్వే కూడా బోగస్సా? అని ప్రశ్నించారు. విపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు.
చేరికలు
ఆదిలాబాద్ మాజీ ఎంపి రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నేతలు రవీందర్ తమ అనుచరులతో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ విపక్షాలపై ధ్వజమెత్తారు. జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఇదేవిధంగా సర్వే చేయిస్తే 80కి పైగా డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తేలిందని, ఎన్నికలకు రెండు నెలలముందే ఈ విషయం తాను ప్రకటించినట్టు గుర్తు చేశారు. టీఆర్ఎస్ గెలిస్తే చెవి కోసుకుంటానని సిపిఐ నారాయణ సవాల్ చేశారని, ఏమైందని ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా తెరాస 99 డివిజన్లలో విజయం సాధించిందని కెసిఆర్ స్పష్టం చేశారు
ఫలితాలు రిపీట్ అవుతాయి..
సాధారణ ఎన్నికల్లో జిహెచ్ఎంసి ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. తమిళనాడులో ఒకసారి అన్నిస్థానాల్లో ఎఐఎడిఎంకె విజయం సాధించిందని, ఒకే ఒక స్థానంలో డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి గెలిచారని, నెనొక్కడినే అసెంబ్లీకి ఎందుకని ఆయన కూడా రాజీనామా చేశారని కెసిఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనకు, టీఆర్ఎస్ పాలనకు విద్యుత్ అంశం ఒక్కటి చాలన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన ఆరు నెలల్లోనే విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించామని అన్నారు.
బాబు మోసం చేశారు..
ఆంధ్ర ప్రజలను ఆ రాష్ట్ర సిఎం చంద్రబాబు మోసం చేశారని, ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ మాఫీ చేస్తామని, వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. తెలంగాణలో మాత్రం రుణ మాఫీ మొత్తం అమలు చేశామన్నారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మహానాడులో తెలంగాణ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అక్కడ ఎన్నుకున్న వారికి ఏమీ చేయలేదుగానీ, తెలంగాణకు వచ్చి ఏదో చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణలో టీడీపీ పనైపోయింది..
తెలంగాణ ప్రజలు తెదేపాను ఎప్పుడో తిరస్కరించారని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. ప్రభుత్వ పనితీరును బట్టి ప్రజలు తీర్పు చెబుతారని, దేశంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అమలు చేస్తున్నాం కనుకే ప్రజలు అన్ని ఎన్నికల్లోనూ తెరాసకు ఘన విజయం చేకూరుస్తున్నారన్నారు. 38 లక్షల మందికి ఆసరా ఫించన్లు అమలు చేస్తున్నాం.. ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పామో వాటన్నింటినీ అమలు చేస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు. మేం ఓడిపోతే భూకంపం వస్తుంది అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవరిస్తున్నారని, తామేమీ అలా భావించడం లేదన్నారు.
ప్రజలకు తెలుసు
సిద్దిపేట నుంచి తాను ఏడుసార్లు, జహీరాబాద్ నుంచి బాగారెడ్డి ఏడెనిమిదిసార్లు విజయం సాధించారని గుర్తు చేశారు. జహీరాబాద్లో బాగారెడ్డి సామాజిక వర్గం ఓట్లు 1500 కన్నా ఎక్కువ లేవని, సిద్దిపేటలో నా సామాజిక వర్గం ఓట్లు వంద కూడా లేవని, కానీ మా ఇద్దరినీ ప్రజలు వరుసగా గెలిపిస్తూనే వచ్చారని గుర్తు చేశారు. బాగారెడ్డి గొప్పనాయకుడు కాబట్టి పనిని చూసి గెలిపించారు కానీ కులాన్ని చూసి కాదన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. రైతు సంక్షేమానికి మరే ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ‘ప్రాజెక్టులు కట్టకుండా కోర్టుల్లో అడ్డుకుంటున్నారు. నిర్మాణాలు ఆపడం మీతరం కాదు' అని హెచ్చరించారు. రెండు నెలలు ఆలస్యం కావచ్చేమోగానీ ప్రాజెక్టులను ఎవరూ ఆపలేరన్నారు. ప్రాజెక్టులను ఆపాలని కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ వెళ్లారని, కానీ న్యాయమూర్తులు ధర్మాన్ని కాపాడతారని గ్రహించలేకపోయారన్నారు. తెరాసకు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు చెబుతారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు.