కేసీఆర్ కే మైలేజ్ దక్కేనా : బీజేపీ -కాంగ్రెస్ "వర్రీ" : హైదరాబాద్ వేదికగా సీఎం కొత్త ప్లాన్...!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. వారం రోజుల ఢిల్లీ యాత్ర తరువాత హైదరాబాద్ వచ్చిన సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొంత కాలంగా ధాన్యం సేకరణ అంశంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. తెలంగాణ రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపిస్తూ వచ్చిన కేసీఆర్..ఇప్పుడు ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇటు హైదరాబాద్..అటు ఢిల్లీలో నిర్వహించిన దీక్షల్లో కేసీఆర్ స్వయంగా పాల్గొని కేంద్రం పైన విరుచుకుపడ్డారు. ఢిల్లీ లో దీక్ష..కేంద్రం వివరణ తరువాత కేసీఆర్ తనకే మైలేజ్ దక్కేలా వ్యహాత్మకంగా వ్యవహరించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాజకీయంగ ఎవరికి ఎం మేర ప్రభావం చూపిస్తోందనే చర్చ మొదలైంది.
కేసీఆర్ వ్యూహంలో భాగంగానే
ధాన్యం విషయంలో కేసీఆర్ తొలి నుంచి రైతుల్లో బీజేపీ పైన వ్యతిరేకత పెంచేందుకు చేసిన ప్రయత్నాల్లో కొంత మేర విజయం సాధించారు. దీంత..ఇక తానే రైతుల కోసం నిలబడ్డాననే సంకేతాలు ఇచ్చేలా చివరకు నిర్ణయం తీసుకున్నారు. అటు బీజేపీ పైన కేసీఆర్ అస్త్రాలు ఎక్కుపెడుతుంటే...ఇటు బీజేపీ కౌంటర్ గా అసలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చేసుకున్న ఒప్పందాలను బయట పెట్టింది.
దీని పైన తాజాగా కేబినెట్ తరువాత మీడియా సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ ఈ మొత్తం వ్యవహారం బీజేపీ - టీఆర్ఎస్ డ్రామాగా ఆరోపించింది. ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం మొదటే తీసుకునే అవకాశం ఉన్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో భాగంగానే టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను చేపట్టింది.
టీఆర్ఎస్ కే మైలేజ్ దక్కుతుందా
పార్టీకి మైలేజీ తెచ్చుకునేందుకు ఊరూరా ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని ఒక వేడుకగా నిర్వహించేందుకు సిద్దమైంది. వ్యవసాయశాఖ నివేదికల ప్రకారం ఈ యాసంగిలో గతేడాది కంటే 20 లక్షల ఎకరాల వరిసాగు తగ్గింది. చాలా మంది రైతులు ప్రభుత్వం ఇక ధాన్యం సేకరించదులే అనుకొని మద్దతు ధరకంటే చాలా తక్కువకు అమ్ముకున్నారు. వారిలోప్రభుత్వ తాజా నిర్ణయం అసంతృప్తి పెంచే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వ నాటకాలను బహిర్గతం చేసి వారంతట వారే ధాన్యం కొనే నిర్ణయం తీసుకునేలా తాము ఒత్తిడి తేగలిగామని బీజేపీ వర్గాలు క్రెడిట్ దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ తాము రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడేసామని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం గింజ కొనే వరకూ తాము రైతులకు అండగా ఉంటామని తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో భాగంగా
ఇక, ఈ వ్యవహారం ముగియటంతో ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ కేంద్రంగా మరో కార్యాచరణకు సిద్దం అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతూనే..జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిస్థితుల పైన మేధావులు..వ్యవసాయ రంగ నిపుణులతో హైదరాబాద్ లో కీలక సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు.
ఈ సమావేశం ద్వారా జాతీయ స్థాయిలో రైతు మద్దతు నిర్ణయాలు..వాటి అమలుకు పోరాటం దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ నిర్వహించే సమావేశం .. ఆ తరువాత కార్యాచరణ పైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.