నకిలీ వాగ్దానాలు చేస్తున్న కేసీఆర్.!కరోనా కట్టడికి సమగ్ర ప్రణాళిక లేదన్న కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ.!
హైదరాబాద్ : కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహరిస్తున్న విధానాలు అత్యంత దారుణంగా ఉన్నాయని, ప్రజల ప్రాణాలను రక్షించే విషయంలో చిత్తశుద్ధి ఉంటే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ ఆలీ షబ్బీర్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం చంద్రశేఖర్ రావు నకిలీ వాగ్దానాలు గుప్పిస్తున్నరని, ఇవి భవిష్యత్తులో ప్రజలకు భారీ హాని కలిగిస్తాయని షబ్బీర్ ఆలీ ఆవేదన వ్యక్తం చేసారు.
అమలు కాని హామీలు ఇస్తున్న కేసీఆర్.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికేనన్న షబ్బీర్ ఆలీ..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, కోవిడ్ ను అరికట్టడంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నకిలీ వాగ్దానాలు చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ ఘాటుగా విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. కోవిడ్ పరిస్థితిని అదిగమించడంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అనేక అమలుకాని హామీలను గుప్పిస్తున్నారని మండిపడ్డారు.
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలం.. సమగ్ర కార్యాచరణ ఉండాలన్న మాజీ ఎమ్మెల్సీ..
కోవిడ్ పరిస్థితిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైఫల్యాలను హైకోర్టు ఎత్తిచూపిన ప్రతిసారి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక సమీక్ష సమావేశం నిర్వహించి తప్పుడు వాగ్దానాలు చేయడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా కట్టడి అంశంలో అధికారులు చెప్తున్న అంశాలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు సంబంధం లేదని అన్నారు. హైకోర్టు వ్యాఖ్యల ప్రభావాన్ని తగ్గించడానికి అనేక సర్కస్ విన్యాసాలు చేస్తున్నారని సీఎం పై విరుచుకుపడ్డారు షబ్బీర్ ఆలీ. దేశంతో పాటు తెలంగాణ కూడా కరోనా రెండవ దశను ఎదుర్కొంటోందని, కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణలోని సిఎం చంద్రశేఖర్ రావు ఇద్దరూ కూడా రెండవ దశను అధిగమించడంలో విఫలం చెందారని అన్నారు.
హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. అందుకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్న షబ్బీర్ ఆలీ..
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచబడక పోవడంతో ఆక్సిజన్, హాస్పిటల్ పడకలు, మందులు, వ్యాక్సీన్లు అన్నీ అందుబాటులోకి రాలేకపోయాయని మండిపడ్డారు. అటు మోడీ ఇటు చంద్రశేఖర్ రావు ప్రభుత్వం రెండూ తాత్కాలిక ఏర్పాట్ల పైనే దృష్టి కేంద్రీకరించారు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కాదని ఆరోపించారు షబ్బీర్ ఆలీ. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాకుండా 324 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులలో 48 ఆక్సిజన్ ఉత్పత్తి కార్మాగారాలను ఏర్పాటు చేస్తామని సిఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. కాని ఎక్కడా ఈ ఆక్సీజన్ కేంద్రాలు ఏర్పాటు కాలేదని మండిపడ్డారు షబ్బీర్ ఆలీ.
కరోనా కట్టడికి నామమాత్రపు చర్యలు కాదు.. నిర్మాణాత్మక ప్రణాళిక అవసరమన్న కాంగ్రెస్ మాజీ మంత్రి..
సంగారెడ్డి. జగిత్యాల్. కొత్తగూడెం.వనపార్తి, మంచిర్యాల్ మరియు మహాబుబాబాద్లలో కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చాలా కాలంగా పెండింగ్లో ఉందని, సిఎం చంద్రశేఖర్ రావు గతంలో ఎప్పుడో ఈ ప్రకటన చేసి ఉండాల్సిందని షబ్బీర్ అలీ అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన పనితీరుపై హైకోర్టు చేసిన కఠినమైన వ్యాఖ్యలను నీరుగార్చడానికి ఇప్పుడే ఆయన దీనిని ప్రకటించారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేసారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటానికి నామమాత్రపు చర్యలు కాకుంగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ సూచించారు.