తెలంగాణపై అమిత్ షా ‘నెట్’: కేసీఆర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీకి ఇక చుక్కలే..
సామాజిక వర్గ సమీకరణాలు ప్లస్ భావోద్వేగ పూరిత నినాదాలతో కూడిన వ్యూహం, ఎత్తుగడలను బీజేపీ తెలంగాణలో అమలు చేయనున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘన విజయాల కిక్కు బీజేపీపై బాగానే పనిచేసినట్లు కనిపిస్తున్నది. ఉత్తర భారతంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ఈశాన్య భారతంలో ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతున్న కమలనాథులు నిజంగానే దక్షిణాది వైపు ఫోకస్ పెట్టారని వారి కదలికలు, చర్యలు సంకేతాలిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అనుసరించిన ప్రగతి నినాదంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు ప్లస్ భావోద్వేగ పూరిత నినాదాలతో కూడిన వ్యూహం, ఎత్తుగడలను బీజేపీ తెలంగాణలో అమలు చేయనున్నదా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో 119 ప్లస్ నామినేటెడ్ ఎమ్మెల్యే పదవితో కలిసి 120 స్థానాలు ఉన్నాయి.
అయితే గతంలో మాదిరిగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరాదిన.. హిందూ రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ లోటును పూడ్చుకునేందుకు దక్షిణాదిపై బీజేపీ గురి పెట్టిందని తెలిసి పోతున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలుగులో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ, లోక్సభ జమిలీ ఎన్నికల్లో పాగా వేసేందుకు కమలనాథులు కదనోత్సాహంతో దూకుడుగా ముందుకెళ్తున్నారు.
ఇదే పరిణామం చోటు చేసుకుంటే అధికార టీఆర్ఎస్తోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తామని కలలు కంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో ఆశలు వదులుకోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇతర పార్టీల నేతల చేరికపై కమలం ఫోకస్
ఇతర పార్టీలు ప్రత్యేకించి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులను తమ బాణీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు జాతీయ స్థాయిలోనే సాగుతున్నాయి. తద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పదికిపైగా ఎంపీ సీట్లు, 60కి పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా టార్గెట్ -2019 కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పార్టీ రాష్ట్ర శాఖను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించిందని సమాచారం. రాష్ట్రంలో గల అనుకూల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు సానుకూల పరిస్థితులున్నందున సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకోవాలని హితవు చెప్పింది. ప్రత్యేకించి పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు ద్వారా కిందిస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చిందని తెలియ వస్తున్నది.
యూపీ.. ఇతర రాష్ట్రాల స్ఫూర్తిగా..
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో కార్యకర్తల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పాల్గొనాల్సి ఉన్నా పార్లమెంటు సమావేశాలు, కీలక బిల్లులు, ఎన్డీయే సమావేశం వల్ల ఆయన పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వానికి పార్టీ కార్యాచరణ ప్రణాళిక గురించి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. 20 ఏళ్లుగా బిజూ జనతాదళ్ అధికారంలో ఉన్న ఒడిశాలో సంస్థాగతంగా పార్టీ పుంజుకోవడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్ఫలిలితాలు సాధించడంతో అదే ఊపును తెలంగాణలోనూ కొనసాగించాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది.
జూన్ తర్వాత దూకుడే దూకుడు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా కీలకం. తాము కోరుకున్న వారిని ఆయా పదవుల్లో నియమించడానికి ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టడం కూడా కమలనాథులకు ముఖ్యమే. అందుకు అనుగుణంగా తొలుత ఎన్డీయే మిత్రపక్షాలతో సోమవారం ప్రధాని నరేంద్రమోడీ సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఖరారుపై ఎన్డీయే సమావేశంలో చర్చించడంతోపాటు మిత్రపక్షాల నేతలందరికీ ఆయన విందునివ్వనున్నారని తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం రాజకీయంగా ఢిల్లీ కేంద్రంగా ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని మార్పుచేర్పులతో తన కార్యాచరణ ప్రణాళికల్లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. జూన్లో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగిస్తే తెలంగాణలో కమలనాథులు ప్రత్యేక శ్రద్ధతో తమ ఫార్ములాను అమలు చేసేందుకు సంసిద్ధులవుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను చేర్చుకొని ఆ లోటును భర్తీ చేసుకోవాలనుకుంటున్నట్లు ఉవ్విళ్లూరుతున్నది.
క్రియాశీలంగా లేని ప్రధాన ప్రతిపక్షం
అధికార టీఆర్ఎస్కు కింది స్థాయి వరకు పార్టీ శ్రేణులు లేకపోవడం, పూర్తిగా జిల్లా కమిటీలు కూడా ఏర్పడకపోవడం, అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ క్రియా శీలకంగా వ్యవహరించకపోవడంతోపాటు మిత్రపక్షం టీడీపీ దాదాపుగా పూర్తిగా బలహీన పడిందనే భావిస్తున్నారు. ఈ పరిస్థితులను తనకు అనువుగా మార్చుకోవాలని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం వరకు రాష్ట్రంలో అంతో ఇంతో పలుకుబడి గల వామపక్షాలు నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్లు క్రమంగా పట్టు కోల్పోతూ నామమాత్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ తమకు అనుకూలమేనని, ఎక్కడైనా ఇబ్బందులున్నా అధిగమించాలని భావిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, ఎన్నికల హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై ఆందోళన బాట పట్టాలని, తద్వారా పార్టీని సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఏపీ నేతలకంటే కేసీఆర్ సూపర్
ఉమ్మడి రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ నేతల నాయకత్వంలోనే టీడీపీ, కాంగ్రెస్ నేతలు మసులుకునే పరిస్థితి నెలకొన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ స్థాపించిన ప్రస్తుత సీఎం కేసీఆర్.. 2001 నుంచి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబులకు సమకాలీనమైన.. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ చాతుర్యం ప్రదర్శించగల, ప్రజాకర్షణ గల నేత అని పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడంతో అనునిత్యం ప్రజలతో కలిసి ఉండటం.. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి వ్యూహాలు మారుస్తూ ఉండటం కూడా గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు దగ్గరయ్యారు. ఆ పార్టీనే అందలం ఎక్కించారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజలకు కాంగ్రెస్ దూరం
కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు.. ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం ప్రయత్నాలు.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న చందంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్క మాటపై ముందుకు సాగితే అధికార పక్షం నిర్ణయాలను విధానాలను ప్రశ్నించేందుకు వీలవుతుంది. వారిలోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలంతా ప్రజలకు దూరమయ్యారు. దీనికి తోడు 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలపై సహజ సిద్ధంగా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తినా.. 20 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందడం ఆషామాషీ కాదు. అయితే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చతురత ముందు కాంగ్రెస్ పార్టీ నేతలెవ్వరూ నిలబడలేదంటే అతిశేయోక్తి కాదు. కేసీఆర్ సమయానుకూలంగా వ్యూహాలు, ఎత్తుగడలు మారుస్తూ తాననుకున్న ఫలితాన్ని సాధించారని విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ ప్లాన్ ఇక అన్ని పార్టీలకూ షాకే
2009లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చిన పార్టీ తెలుగుదేశం. చివరి క్షణం వరకు తెలంగాణ విభజనను అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. అయితే నాటి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ప్లస్ పవన్ కల్యాణ్ సహకారంతో 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో చంద్రబాబు అటువైపు మొగ్గు చూపినా.. ఆయన రాజకీయ చాతుర్యం తెలంగాణపై చూపారు. దాని ఫలితంగానే వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు నోటు' కేసులో చంద్రబాబు వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. చంద్రబాబు తన ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న ఆరోపణ రాజకీయంగా, న్యాయబద్ధంగా నిలబడకపోవచ్చు గానీ.. ఆ కేసు పూర్తిగా తేలితే నష్టపోవాల్సి వస్తుందన్న ముందుగానే విజయవాడకు మకాం మార్చారు. నాటి నుంచి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ గల నేతలే లేరు. ఉన్న వారు కూడా క్రమంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ క్రమంలో వచ్చే జమిలీ ఎన్నికల్లో బీజేపీ సర్వ శక్తులు ఒడ్డితే మాత్రం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా కష్టాల్లో చిక్కుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.