కేసీఆర్ మరో ఊహించని అడుగు, మోడీకి షాక్: కేంద్రంపై గవర్నర్కు ఫిర్యాదు
Recommended Video

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ గళమెత్తిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మరో అడుగు ముందుకేశారు. ఈసారి ఏకంగా కేంద్రం తీరుపై ఆయన గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.
తెలంగాణపై కేంద్రం తీరు ఏమాత్రం సరిగా లేదనికేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి ఎలాంటి ప్రోత్సాహం లేదని, విభజన హామీలు సైతం అమలు జరగడం లేదన్నారు. కేసీఆర్ సోమవారం రాత్రి రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.

దేశ రాజకీయాలపై మార్పు కోసం ప్రయత్నిస్తున్నా
దాదాపు రెండు గంటల పాటు వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందని సమాచారం. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుపై కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల కేంద్రం విధానం మారాలన్నదే తన అభిమతమని చెప్పారు. ఇందుకోసం తాను జాతీయ రాజకీయ ప్రక్షాళనపై దృష్టి సారించానని కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ వాదం పట్టించుకోవడం లేదు
దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ప్రగతిపరంగా కొన్ని అంశాల్లో ఇంకా పునాది దశలోనే ఉందని, ఇది బాధాకరమని, పాలనలో సమగ్ర మార్పు రావాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలలోను ఇదే అభిప్రాయం ఉందని, కొత్తగా ఏర్పడిన తెలగంాణ స్వయంవృద్ధిని సాధిస్తున్నా కేంద్రం నుంచి సాయం అందాలని కోరుకుందని, కానీ ఏమీ జరగడం లేదని, హామీలపై తెలంగాణ వాదన పట్టించుకోవడం లేదని కేసీఆర్ వాపోయారు. తమపై చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు.

సన్నిహిత సంబంధాలు ఉండాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలని, ఢిల్లీ పెద్దలు రాష్ట్రాల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉండాలని, సమాఖ్య స్ఫూర్తి రావాలని, కానీ ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. తెలంగాణ ప్రగతిని ప్రధాని, కేంద్రమంత్రులు ప్రశంసించారని, కానీ సాయానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. మీరు అనుభవజ్ఞులు అని, గవర్నర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తున్నారని, వాస్తవాల ఆధారంగా రాష్ట్రాల అవసరాలని కేంద్రం గుర్తించి ఆదుకోవాలని కేసీఆర్.. గవర్నర్తో అన్నారని తెలుస్తోంది.

నాది ఆవేశం కాదు, ఆవేదన
దేశ పరిస్థితి, రైతులపై తనది ఆవేశం కాదని ఆందోళన అని కేసీఆర్ గవర్నర్కు చెప్పారని తెలుస్తోంది. రైతులను పట్టించుకునే నాథులే కరువయ్యారన్నారు. మద్దతు ధరతో రైతు ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. భారత్.. చైనా, అమెరికా, జపాన్ స్థాయికి ఎదగాలన్నారు.

నా రాష్ట్రం తరఫున గళం విప్పా
కేంద్రంపై తిరుగుబాటు తాను తొందరపాటులో, ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని, ఆవేదన అని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల తరఫున తాను గళం విప్పానని, నా రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్నానని, ఇందుకోసం ఢిల్లీ వేదికగా మాట్లాడుతానని, ఇది అన్ని రాష్ట్రాలకు మేలు చేస్తుందన్నారు. గవర్నర్ల వ్యవస్థలో మార్పు కోసం మీరు సిఫార్సులు ఇచ్చారని, అలాగే పాలనలో మార్పు రావాలన్నారు. అదే సమయంలో, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 12న ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడాలన్నారు.












Click it and Unblock the Notifications