చంద్రబాబు సర్కార్ జరిపిన కాల్పులతో నిర్ధారించుకున్నా: కెసిఆర్
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ బషీర్బాగ్లో జరిగిన ఉద్యమంపై నాటి చంద్రబాబు సర్కారు జరిపిన కాల్పులతో.. ఇక తెలంగాణకు న్యాయం దక్కదని నిర్ధారించుకున్నానని, వెనువెంటనే అప్పటిదాకా తనకున్న అన్ని రాజకీయ పదవులను త్యజించి తెలంగాణ ఉద్యమంలోకి దూకానని సీఎం కెసిఆర్ అన్నారు.
ప్రాజెక్టుల పైన కెసిఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందు ఇరిగేషన్ ప్రాజెక్టులు, సమైక్య పాలనలో జరిగిన అన్యాయంపై సభలో మాట్లాడారు.
ఎన్నో అవమానాలు, దానికి తోడు బషీర్బాగ్ కాల్పుల నేపథ్యంలో ఇక తెలంగాణ కచ్చితంగా కావాలని భావించి తాను తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీని స్థాపించానని చెప్పారు. తాను పార్టీ పెట్టినప్పుడు.. ఉద్యమాన్ని ఎంతోమంది అపహాస్యం చేశారన్నారు.
తెలంగాణ ఉద్యమానికి దేశవ్యాప్తంగా 36 పార్టీలు మద్దతు పలికాయన్నారు. బిజెపి, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయన్నారు. తెలంగాణ ఉద్యమం అజెండా.. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అన్నారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిందన్నారు.
తెలంగాణ వచ్చింది కాబట్టి మన నిధులు మనమే ఖర్చు పెట్టుకోగలమన్నారు. ఇక మన చేతిలో పాలన ఉంది కాబట్టి ఉద్యోగాలు మనవి మనకే ఉంటాయన్నారు. ఇక మిగిలింది నీళ్ల సమస్య అన్నారు. ప్రజలు ఇప్పుడు నీళ్ల కోసమే ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆర్డీఎస్ అన్యాయాన్ని పాదయాత్రతో అడ్డుకున్నామన్నారు.
తెలంగాణ వచ్చాక మేం అనేక సమస్యలతో పాటు నీటి పారుదల ప్రాజెక్టుల పైన దృష్టి సారించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. సమైక్య పాలనలో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ఆనాడు విద్యుత్ ఛార్జీల పెంపు పైన పాలకులకు లేఖ రాశానని చెప్పారు.
తెలంగాణలో సమైక్య పాలకులు చెరువులన్నీ ధ్వంసం చేశారన్నారు. సుదీర్ఘ పోరాటం, ఆత్మబలిదానాల తర్వాతే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమ అజెండా అయిన ఉద్యోగాలు, నియామకాలు రెండూ పూర్తయ్యాయని, నీళ్లు ఒకటే మనకు మిగిలి ఉందన్నారు. తెలంగాణ నుంచి చాలామంది వలస పోయారన్నారు.
తెలంగాణ అంటే ముంబై.. దుబాయి.. బొగ్గుబాయి అనే పరిస్థితి ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం దక్కదన్న స్థిర నిర్ణయంతోనే ఉద్యమంలోకి దూకానని చెప్పారు. పలు కీలక సమస్యలపై ఎన్ని లేఖలు రాసినా నాటి పాలకుల నుంచి స్పందన కరువైందన్నారు. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నదుల్లో డబ్బులు వేశా
కృష్ణా, గోదావరి నదుల్లో నేను వేసినన్ని నాణేలు ఎవరూ వేయకపోవచ్చునని చెప్పారు. నదులలో డబ్బులు వేయడం మన ఆచారం అన్నారు. నేను నదుల్లో డబ్బులు వేసే విషయం తన డ్రైవర్కు, చాలామంది పోలీసులకు తెలుసునని చెప్పారు. తెలంగాణ బతుకులను మార్చాలని నదీమతల్లుల్ని ప్రార్థించానని చెప్పారు.
వాటర్ షెడ్ అంటే కాకతీయ రాజులే గుర్తుకు వస్తారన్నారు. గొలుసు కట్టు చెరువులు కట్టించారన్నారు. కాకతీయ రెడ్డి రాజులు ఎన్నింటినో కట్టించారన్నారు. కాకతీయ రెడ్డి రాజుల ఆనవాయితీని కులీ కుతుబ్ షా కొనసాగించారన్నారు. ఆసిఫ్ జాహీ నవాబులు ఓ అడుగు ముందుకేశారన్నారు.
11వ శతాబ్దంలో కట్టిన ప్రాజెక్టులు ఈ రోజుకు ఉన్నాయన్నారు. అవి ఈ రోజుకు లక్షల ఎకరాలకు నీటిని అందిస్తున్నాయన్నారు. సమైక్య పాలకులు తెలంగాణ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర సమస్యలు, పర్యావరణ సమస్యల్లో ఇరికించేవారని ఆరోపించారు. కాకతీయ సామ్రాజ్యంలో 75వేల చెరువులు నిర్మించారన్నారు. ఇప్పుడు తెలంగాణలో నీరు ఎలా తీసుకు రావాలనే తమ ప్రయత్నమని, ఒకరిని విమర్శించే ఉద్దేశ్యం తనకు లేదన్నారు.
నిజాలు చరిత్రకు తెలియాలనే అసెంబ్లీలో నా మాటలు రికార్డు కావాలని కోరినట్లు కెసిఆర్ చెప్పారు. మహారాష్ట్రలో 450 ఆనకట్టలు కట్టారన్నారు. తెలంగాణకు లాభం లేని ప్రాజెక్టు దుమ్ముగూడెం టెయిలెండ్ ప్రాజెక్టు అన్నారు. దీంతో తెలంగాణతో పాటు, ఏపీకి నష్టమని చెప్పారు. దీని వల్ల చుక్క నీరు రాదన్నారు. అందుకే అందుబాటులో ఉన్న నీరు ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం హెలికాప్టర్లతో సర్వే చేయించామన్నారు.