కేసీఆర్ కు కొత్త రాజకీయశత్రువులుగా వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్; రచ్చ చేస్తున్నారుగా!!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్, బిజెపి పార్టీల వల్లనే కాకుండా మరికొన్ని పార్టీలు తలనొప్పిగా తయారయ్యాయి. సీఎం కేసీఆర్ కొత్త పరేషాన్ కు కారణంగా మారాయి. ఇటీవల రాష్ట్ర రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన పార్టీల వల్ల వచ్చే ఎన్నికలలో ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరి ఓట్లకు గండి పడుతుంది అన్న ఆందోళన అన్ని పార్టీ శ్రేణులలోనూ వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణాలో రంగంలోకి కొత్త పార్టీలు .. దూకుడు చూపిస్తున్న వైఎస్ షర్మిల పార్టీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే కొత్తగా బరిలోకి దిగిన పార్టీలు చాపకింద నీరులాగా పని చేసుకు వెళుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే వైయస్సార్ కుమార్తె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీతో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ అవినీతి పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ఉన్నారు.

వైఎస్ షర్మిల పాదయాత్రతో గులాబీ బాస్ కు కొత్త పరేషాన్
కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ షర్మిల ఇప్పటికే 15 వందల కిలో మీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి, గ్రామగ్రామాన పర్యటిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల పర్యటనలకు ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. ఇక వైయస్ జగన్ మీద ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్న తీరు గులాబీ బాస్ కేసీఆర్ కు మింగుడు పడడం లేదని సమాచారం.

బహుజన రాజ్యస్థాపన అజెండాతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలపై కేసీఆర్ నజర్
ఇదిలా ఉంటే బిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కెసిఆర్ ను గద్దె దించి ఏనుగునెక్కి ప్రగతి భవన్ కు వెళ్తానని చెబుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహుజన రాజ్యస్థాపన అజెండాతో రంగంలోకి దిగిన బీఎస్పీ పార్టీతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగడం కూడా కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓ స్థాయిలో ప్రజల మనసులను ప్రభావితం చేయగలిగిన నేత కావడంతో కెసిఆర్ ఈ పార్టీలపై కూడా నజర్ పెట్టారని సమాచారం.

రాజకీయంగా కేసీఆర్ కు కొత్త శత్రువులు .. వారిపైనా కేసీఆర్ దృష్టి
పాదయాత్రలు చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటున్న వైయస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు ప్రజలలో కెసిఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, కెసిఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న అవినీతిని, కెసిఆర్ అసమర్థ పాలనను నిత్యం ఎండగడుతున్నారు. వచ్చే ఎన్నికలలో కెసిఆర్ పార్టీకి చరమగీతం పాడాలని పిలుపునిస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు అధికారం కట్టబెట్టిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదని, మళ్లీ అధికారం ఇచ్చినా ఏమీ చేయబోరని చెబుతున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును సమర్ధులైన నాయకులకు వేసి వినియోగించుకోవాలని పదే పదే సూచిస్తున్నారు. ఇక వీరి ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆందోళనలో ఉన్న కేసీఆర్ రాజకీయంగా కొత్త శత్రువుల దూకుడును కట్టడి చేయడానికి కూడా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications