పెను ప్రభావం: పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్, ‘జీతాల తగ్గింపు?’
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. పెద్దనోట్ల రద్దు ఉద్యోగులు, పేదలు, రైతులు ఇలా ప్రజలందరిపైనా పెనుప్రభావం చూపుతోందని అన్నారు. కేంద్రం తీసుకున్న రద్దు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజలందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
కేంద్ర నిర్ణయం సబబు కాదని, పర్యవసానాలను అంచనా వేయకుండా ముందుకెళ్లిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు పర్యవసానాలపై రోజువారీ సమీక్షించి, సమస్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పెద్దనోట్ల రద్దు పర్యవసానాలపై ముఖ్యమంత్రి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ తదితర 12 శాఖల ఉన్నతాధికారులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు అంశాలను వివరించారు.
పెద్దనోట్ల రద్దు వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని, తద్వారా జీతభత్యాలు తగ్గుతాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరవు భత్యం (డీఏ) ఖరారుకు ద్రవ్యోల్బణాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే డీఏ పెరుగుతుందని, ఇప్పటి వరకు ఈ పెరుగుదల ఏడు శాతం ఉండడంతో ఉద్యోగుల జీతభత్యాలు పెరిగాయని అన్నారు. కేంద్రం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు.
నిబంధనల మేరకు ద్రవ్యోల్బణం తగ్గితే ఉద్యోగుల డీఏను తగ్గించాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గుతాయని అన్నారు. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గించడం అనివార్యమవుతుందని ఉన్నతాధికారులు వివరించారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగుల జీతభత్యాలు తగ్గలేదని, తొలిసారిగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు వివరించారు.
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న పేదలు ఎవరైనా బ్యాంకులో రూ.2.50 లక్షలు మించి డిపాజిట్ చేస్తే వారిని దారిద్రరేఖకు దిగువ కేటగిరీ నుంచి తప్పించే ప్రమాదం ఏర్పడుతుందని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయ పరిమితి గల వారినే అర్హులుగా చూస్తున్నామని, ఆ పరిమితి దాటిన వారు పథకాలకు అనర్హులవుతారని పేర్కొన్నారు. రైతుల విషయంలో రూ. 2.50లక్షల నిబంధన కొంత ఇబ్బందిగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాగా, నవంబర్ 16 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశాన్ని చర్చించాలని సీఎం కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. కీలకమైన ఈ అంశంపై ప్రజల మనోభావాలను కేంద్రానికి వెల్లడించాలని సూచించారు. ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్, బీబీపాటిల్ తదితరులు సోమవారం సీఎంను కలిసినప్పుడు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇది ఇలా ఉండగా, పెద్దనోట్ల రద్దు పరిణామాలను కేసీఆర్ రాష్ట్రానికి వచ్చిన కేంద్రబృందం దృష్టికి తీసుకెళ్లారు. అక్టోబర్ నెలలో జరిగిన పంట నష్టాలపై అంచనా కోసం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్కుమార్ నేతృత్వంలో వచ్చిన బృందం సోమవారం సీఎంను ఆయన నివాసంలో కలిసింది. నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్రంపై పెనుప్రభావం చూపిందని, అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయని కేసీఆర్ కేంద్ర బృందానికి వివరించారు.