కేసీఆర్ ది ఒంటెద్దు పోకడ..! లోక్ సభ ఫలితాలతో మబ్బులు విడిపోతాయన్న రేవంత్..!!
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో సారి మండిపడ్డారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఏకపక్షంగా చంద్రశేఖర్ రావు పరిపాలన కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. కేసీఆర్ సొంత పార్టీ నాయకులను హీనంగా చూస్తూ ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనముందా? అని ప్రశ్నించారు. పదవి కోసం తాను పని చేయట్లేదని, పార్టీ కోసమే కష్టపడుతున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలును చూడలేకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.
రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ?ఈ సారైనా గట్టెక్కుతాడా ?
హైదరాబాద్లో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను రేవంత్ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ''కేసీఆర్ మొదటిసారి గెలిచాక రాష్ట్రంలో నియంతృత్వ పాలన చేశారు. రెండో సారి ఎన్నికయ్యాక అరాచక పాలన చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయొద్దనేలా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశించాం. కానీ పరిహాసం చేస్తున్నారు.
తెరాసలోని నేతలను పట్టించుకోకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొంటున్నారు. ఈ ఎన్నికలు భాజపా వర్సెస్ కాంగ్రెస్గా, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒకవేళ తెరాస ఎక్కువ సీట్లు సాధిస్తే ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పగలరా?'' అని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కీ చంద్రశేఖర్ రావు ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేసారు.