కట్డలు కడ్దాం: కెసిఆర్, మీడియాకు నో ఎంట్రీ
వరంగల్: గోదావరి నదిపై ఇంకా ఎక్కడెక్కడ ఆనకట్టలను కట్టే అవకాశం ఉందో పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సాగునీటి శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మన ప్రాంతంలో ప్రవహింజచే నదులకు చెందిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు.
ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రం పాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా అవసరమైన అధ్యయనాలు చేయాలన్నారు. కాళేశ్వరం వద్ద బ్యారేజీ కట్టేందుకు అవసరమైన సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. వరంగల్ జిల్లా కంతనపల్లి ప్రాజెక్టు స్థలాన్ని ఆదివారం ఉదయం ఆయన సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. కంతనపల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 టీఎంసీల నుంచి 100 టీఎంసీలకు పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అతిథి గృహంలో జిల్లా అధికారులు, ఇంజనీర్లతో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి సమస్యలను తీర్చే పీవీ నరసింహారావు కంతనపల్లి ప్రాజెక్టు, జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ప్రాధాన్య అంశాలుగా గుర్తించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పారు.

కంతనపల్లి వద్ద 250 మెగావాట్ల ఉత్పత్తి ద్వారా విద్యుత్ సమస్యలను అధిగమించాలన్నారు. భారీ అంచనాలతో చేపట్టిన దేవాదులను నిర్ణీత సమయం దాటిపోయినా పూర్తి చేయలేకపోయామని, ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ప్రాజెక్టుల నిర్మాణాల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.
మీడియాకు నో ఎంట్రీ
ముఖ్యమంత్రి కెసిఆర్ను కలుసుకోవడానికి ప్రయత్నించిన ముంపు గ్రామాల ప్రజలకు నిరాశే ఎదురైంది. తమ ఊర్లు మునిగిపోతున్నా మమ్మల్ని పట్టించుకున్న వారే కరువయ్యారని, ఏ ముఖ్యమంత్రి అయినా పలకరించక పోతే కనీసం ప్రజలకు దూరం నుంచైనా అభివాదం చేస్తారని, కేసీఆర్ మాత్రం కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పర్యటనలో మీడియాకు అడగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రాజెక్టుల సందర్శనకు, సమీక్షా సమావేశాలకు అనుమతించలేదు.












Click it and Unblock the Notifications