కేటీఆర్కు కేసీఆర్ ఫోన్: కూల్చివేతలపై ఆరా, జీహెచ్ఎంసీకి ఎదురుదెబ్బ
హైదరాబాద్: నగరంలో ఆపరేషన్ నాలా రెండో రోజుకు చేరుకుంది. తుదిదశలో భాగంగా నగరంలోని నాలాలపై అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం కూల్చుతున్న సంగతి తెలిసిందే. అయితే మహావీర్ ఆసుపత్రి వెనుక భవనం కూల్చడానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది.
నాలాల ఆక్రమణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట మయూరి మార్గ్లో నాలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలను కట్టినట్లు అధికారులు గుర్తించారు. పోలీసు బందోబస్తు మధ్య నాలాలపై ఉన్న ఆక్రమణలను కూల్చుతున్నారు.
గచ్చిబౌలిలోని ఆక్రమణలను కూడా అధికారులు తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే నాలాల ఆక్రమణల్లో 4 వేల పేదల ఇళ్లను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నయం చూపిస్తామని అధికారులు చెబుతున్నారు.
హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న భవన యజమాని
కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న ఆ భవన యజమాని జీహెచ్ఎంసీ అధికారులను వెనక్కి పంపించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎంత వరకూ వచ్చిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అడిగారు. సీఎం కేసీఆర్ మంగళవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు.
కేటీఆర్కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
దీంతో ఆయన మంత్రి కేటీఆర్కు ఫోన్ చేసి హైదరాబాద్లోని నాలాలపై ఉన్న ఆక్రమణల తొలగింపు పనులు ఎంతవరకూ వచ్చాయని కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. నాలాలపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్కు సూచించారు.
తొలగింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే మరింతమంది సిబ్బందిని కూలీలను నియమించుకోవాలని సూచించారు. నాలాల ఆక్రమణలకు సంబంధించిన పక్కా ఆధారాలతో స్థలాలకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకుంటే యజమానులకు డాక్యుమెంట్లను చూపిస్తున్నారు.
నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగింపు
శేరిలింగంపల్లి ప్రాంతంలో మంగళవారం కూడా ఆక్రమణలను తొలగిస్తున్నారు. మరోవైపు మియాపూర్, దీప్తిశ్రీనగర్ ప్రాంతాల్లోనూ రెండు కిలోమీటర్ల మేర నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
కాగా అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అడ్డుపడవద్దని ఎమ్మెల్యేలకు తెలంగాణ సర్కార్ సూచించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల జోక్యం ఉండకూడదని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది.
పోలీసు బందోబస్తు
గతంలో ఆక్రమణలపై ధ్వంధ్వవైఖరిని ప్రదర్శిస్తూ రాజకీయనేతలు వీటి కూల్చివేతలను అడ్డుకునే వారు. ఇపుడు ఆ పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను సమన్వయం చేసుకుని, వారి బందోబస్తుతో మరీ జిహెచ్ఎంసి టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు.