కేసీఆర్ ముందస్తు పరుగుకు కేంద్రం పచ్చజెండా ఊపుతుందా..? స్పీడు బ్రేకర్లు వేస్తుందా..?
హైదరాబాద్; తెలంగాణ ముందస్తు ఎన్నికల హడావిడి దేశ రాజకీయాల ద్రుష్టిని ఆకర్షిస్తోంది. సాధారణ ఎన్నికలకు కావల్సినంత సమయం ఉన్నప్పటికి ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందస్తుకు వెళ్తున్నారనే అంశం సమాదానం లేని ప్రశ్నాగా మిగిలిపోతోంది. ముహూర్తబలం కోసమో., అనుకూల గ్రహాలకోసమో ముందస్తు ఎన్నికలు నిర్వహించడం ఎందుకనే సందేహాలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అసలు ముందస్తుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎందుకు వస్తుందో అన్ప ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలనే డిమాండ్ కూడా తెరమీదకొస్తోంది. బాట్స్ మెన్ గ్లౌసులు సరిచేసుకుంటున్నప్పుడు బౌలింగ్ చేసి డౌకట్ చేసామని సంబరాలు చేసుకుంటే సరిపోంతుందా..? ఔట్ అయ్యాడో కాలేదో తేల్చేందుకు ఎంపైర్, ఆ పైన థర్డ్ ఎంపైర్ ఉంటాడన్న అంశాన్ని మర్చిపోతే ఎలా..? కేసీఆర్ ముందస్తు ఎన్నికల నిర్ణయం అచ్చు ఇలాగే ఉందనే వాదన వినిపిస్తోంది.
తెలంగాణ ముందస్తు హడావిడి..! కేంద్రం చేతిలో నిర్ణయం..!!
ముందస్తు ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నా దీనిపై క్లారిటీ మాత్రం డిల్లీ పర్యటన తర్వాతే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా కెసీఆర్ నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందస్తుకు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో కెసీఆర్ శుక్రవారం నాటి సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ముందస్తు ఎన్నికలకు సీఎం కెసీఆర్ ఎన్నికల సంఘానికి కారణం ఏమి చెబుతారు?. వాస్తవానికి కెసీఆర్ అక్కడ కారణం చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎన్నికల సంఘం కూడా కెసీఆర్ కోరినట్లు ముందస్తు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.
ముందస్తుకు ప్రధాన కారణం ఏంటి.. కేసీఆర్ కేంద్రానికి ఏం చెబుతారు..?
ఇప్పుడు తమకు రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ముందస్తుకు వెళతాం సహకరించాలని కోరతారా?. ఆలస్యం అయితే పార్టీకి కష్టాలు పెరుగుతాయి కాబట్టి ముందుగా ఎన్నికలు పూర్తి చేసుకుంటామని చెబుతారా?. రాజకీయ కారణాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పరిగణనలోకి తీసుకుంటుంది. దీనిపై ఎవరైనా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి సహేతుకమైనా కారణం లేకుండా ఎందుకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. నవంబర్-డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిపినా మళ్లీ నాలుగైదు నెలల తేడాతోనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది కదా? రెండు సార్లు ఖర్చు ఎందుకు అనేది తెలంగాణలో ప్రతి పౌరుణ్ని వేధిస్తున్న ప్రశ్న..!
ఢిల్లీ పరిణామాలను అనుగుణంగానే ముందడుగు..!
అసలు అంత అత్యవసరంగా తెలంగాణలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది?. కెసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే ప్రజలపై అనవసర భారాన్ని ఎందుకు వేయాలి? అనే ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు లేవు. ప్రధాని మోడీతో సమావేశం అయి పలు అంశాలపై క్లారిటీ తెచ్చుకునేందుకే చంద్రశేఖర్ రావు ఆకస్మికంగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని చెబుతున్నారు. అందుకే ఎక్కువ మంది సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని నమ్ముతున్నారు. అయితే టీఆర్ఎస్ మాత్రం సెప్టెంబర్ 2 సభ ద్వారా తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే ఢిల్లీలో జరిగే పరిణామాలను బట్టే భవిష్యత్ అడుగులు ఉంటాయని చెబుతున్నారు.
ముందస్తుతో ఎవరకి నష్టమో చూద్దాం అంటున్న కాంగ్రెస్..!
మొత్తానికి అధికార పార్టీ ఎన్నికల వేడి పెంచే పనిలో మాత్రం ఉంది. ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తే కాంగ్రెస్ కు ఓటమి భయం అంటారనే కారణంతో ఆ పార్టీ కూడా షెడ్యూల్ కంటే ముందే ఓడిపోయి కెసీఆర్ ఇంటికి పోతామంటే తామెందుకు వద్దంటామని వ్యాఖ్యానిస్తూ ధీమాను ప్రదర్శిస్తోంది. మెజారిటీ ఉన్న పార్టీగా కెసీఆర్ కు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కోరుకునే అధికారం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దీనికి ఆయన ప్రజలకు ఏం సమాధానం చెబుతారన్నదే ఆసక్తికర అంశంగా మారుతోంది.