మొక్కు తీర్చుకున్నారు: భద్రకాళీ అమ్మవారికి కేసీఆర్ స్వర్ణ కిరీటం
వరంగల్: సీఎం కేసీఆర్ దంపతులు భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం సమర్పించుకున్నారు. దుర్గాష్టమి పర్వదినం, అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా కేసీఆర్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.3.70 కోట్ల విలువ గల 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పిడితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటంతోపాటు కురవి వీరభద్ర స్వామికి బంగారుమీసం, తిరుపతి వేంకటేశ్వరస్వామికి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి కిరీటాలు సమర్పిస్తామని మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించినట్లు సీఎం తెలిపారు. 2017 మార్చిలో కురవిలో జరిగే ఉత్సవాల్లో కురవి వీరభద్రస్వామికి మీసాలు సమర్పిస్తామని, తిరుపతి వేంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మకు కూడా త్వరలోనే కిరీటాలను సమర్పిస్తామని తెలిపారు.