చంద్రబాబు బలహీనతపై కేసీఆర్ దెబ్బ!: ఫోకస్ అంతా అటు వైపే..
తప్పుడు లెక్కలతో తెలంగాణను బద్నాం చేస్తున్నారంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను ఉతికారేశారు. నిజానికి ఆ సమయంలో మీడియా కవరేజీ అంతా చంద్రబాబు చుట్టూ ఉంటుందనుకున్నారు.
విజయవాడ: మీడియా మేనేజ్మెంట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఎంతటి ఘనాపాటి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ ఓ అనుకూల మీడియాను ఏర్పరుచుకుని ఏళ్లుగా తన ప్రాభవాన్ని గొప్పగా చాటింపు వేసుకుంటూనే ఉన్నారు. కేవలం ఆయనకు ప్రచారం కల్పించడం మాత్రమే కాదు, ఆయన మీద ఈగ వాలినా సదరు అనుకూల మీడియా వెంటనే రంగంలోకి దిగిపోతుంది.
ఆయన పట్ల వ్యతిరేకత లేకుండా చూడటం, ఎప్పుడూ జనంలో ఆయన పట్ల పాజిటివ్ చర్చలు జరిగేలా చేయడం సదరు మీడియాకు ఒక దినచర్య లాంటివనే చెప్పాలి. ఇంతలా చంద్రబాబుకు అండగా నిలబడే మీడియా కూడా ఒకానొక ప్రతికూల అనివార్య స్థితిని ఎదుర్కొంటుంది. అది తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచే కావడం గమనార్హం.
యాథృచ్చికంగానే జరిగిందో లేక మరేమో తెలియదు గానీ.. మొన్నటికి మొన్న హైదరాబాద్ మహానాడులో చంద్రబాబు ప్రసంగించే సమయానికే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. తప్పుడు లెక్కలతో తెలంగాణను బద్నాం చేస్తున్నారంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను ఉతికారేశారు. నిజానికి ఆ సమయంలో మీడియా కవరేజీ అంతా చంద్రబాబు చుట్టూ ఉంటుందనుకున్నారు.
కానీ, మీడియా చానెళ్లు మొత్తం కేసీఆర్ ప్రెస్ మీట్కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. దీంతో అనుకూల మీడియాలోను చంద్రబాబుకు అంతగా కవరేజీ లభించలేదు. ఇక ఆ తర్వాతి రోజు కూడా ఇదే సీన్ రిపీటైంది. తొలిరోజు మహానాడు విశేషాలకు ఆ సాయంత్రం విస్తృతంగా ప్రచారం కల్పించాలని చూసిన మీడియాకు కేసీఆర్ మళ్లీ బ్రేక్ వేశారు. ఎమ్మెల్యేలతో మీటింగ్.. సర్వే లీకులతో చానెళ్లన్ని దాని చుట్టే కథనాలను ప్రసారం చేశాయి.
దీంతో తొలిరోజు మహానాడు సైతం అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఇక మహానాడు చివరి రోజు మీడియాలో చంద్రబాబే హైలైట్ అవుతారని భావిస్తున్న తరుణంలో.. కేసీఆర్ మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ రమేశ్ రాథోడ్ పార్టీలో చేరిన సందర్భంగా గంట పాటు ఆయన ప్రసంగించారు. దీంతో మీడియా చానెళ్లన్ని మళ్లీ అటువైపు ఫోకస్ చేశాయి.
ఒకవిధంగా చంద్రబాబు ప్రసంగాలు జనాకర్షణీయంగా లేకపోవడం.. మరోవైపు కేసీఆర్ ప్రసంగాలకు జనంలో ఆకర్షణ ఉండటంతో మీడియా చానెళ్లు సైతం కేసీఆర్ వైపే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరు ఒకే సమయంలో గనుక ప్రెస్ మీట్లు పెడితే.. కేసీఆర్ వైపే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టడం టీడీపీకి అంతగా రుచించడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ఎప్పుడూ మీడియాలో హైలైట్ అవాలని భావించే చంద్రబాబు బలహీనతపై కేసీఆర్ ఈవిధంగా దెబ్బకొట్టారన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.