తడబడుతున్న కేసీఆర్..! ప్రసంగించలేకపోతున్న కేటీఆర్..! ఆందోళనలో అభ్యర్థులు..!!
హైదరాబాద్ : తెలంగాణ రథసారథులు, అచంచల ఛండశాసనులు, మాటల మాంత్రికులు, వ్యూహకర్తలుగా ఓ బ్రాండ్ తెచ్చుకున్న ఆపథర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన తనయుడు కల్వకుంట్ల తారకరామారావు మాటలు తడబడుతున్నాయి. మాటలను తూటాల్లా పేల్చే ఈ తండ్రీ కొడుకులు ఇటీవల తమ ప్రసంగాల్లో మునుపటి వాడివేడిని తగ్గించారు. ఎప్పుడూ ప్రజల నాడిని తమ మాటల్లో వినిపించే ఈ ఇద్దరు నేతలు పట్టు తప్పి ప్రసంగిస్తున్నట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికల్లో స్ఠార్ క్యాంపెయినర్ల బాద్యతను మీదేసుకున్న కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాల్లో పదును తగ్గడంతో వాళ్లనే నమ్ముకున్న మిగతా ఎమ్మెల్యేలు ఖంగారు పడుతున్నారు. ఆదిలోనే వీళ్లు ఇలా ప్రచారంలో పదనిసలు వినిపిస్తుంటే ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
శ్రుతి తప్పుతున్న కేసీఆర్..! గొంతు సమస్యతో కేటీఆర్..! ప్రచారంలో పదనిసలు..!!
కేసీఆర్ అసందర్బ ప్రేలాపనలు, రోడ్ షోలలో కేటీఆర్ కు ఎదురౌతున్న అపశ్రుతులకు తోడు గొంతు ఇబ్బందులు పెడుతుండడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు తెలంగాణలో ప్రత్యామ్నాయం కూడా లేకపోవడంతో ప్రచారంలో వారినే నమ్ముకున్న నాయకులు తమ ప్రచారం సరళి పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో ఇలా జరగడం ఏంటని తమలో తాము చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ప్రచారానికి తెర తీయడం, వారిని ధీటుగా ఎదుర్కొనే సమయంలో ఇలా .జరగడం పార్టీకి ఇబ్బందికర పరిణామాలేననే చర్చ తారాస్థాయిలో జరుగుతోంది.
కేసీఆర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు..! దిద్దుబాటు దిశగా గులాబీ బాస్..!
టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను భయాందోళనలకు చేస్తున్నారా..? ప్రజల్లో ఉన్న తెలంగాణసెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటున్నారా..? ఈయన చేసిన తాజా వ్యాఖ్యలు చూసి అవుననే అంటున్నారు తెలంగణ ప్రజలు. నిర్మల్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి. ‘‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే నాకేం నష్టం లేదు. ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. టీఆర్ఎస్ గెలవకపోతే.. రాష్ట్రం చంద్రబాబు చేతుల్లోకి వెళుతుంది''అని ఆవేదనతో కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ.. ప్రాజెక్టులు కట్టొద్దని 35 లేఖలు రాసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టులను పూర్తిచేస్తాడా? అని చెప్పుకొచ్చారు.
వాడి తగ్గిన కేసీఆర్ ఉపన్యాసాలు..! ప్రజల నుంచి కరువైన స్పందన..!!
ఈ మాటలు విన్నాక కూడా సభకు వచ్చిన జనాలనుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంటే జనాలు కేసీఆర్కు జై కొడుతున్నారా..? లేక చంద్రబాబుకు జై కొడుతున్నారా? అనేది తెలియని పరిస్థితి. సెకండ్ టర్మ్ ప్రచారం మొదలైనప్పటి నుంచి కేసీఆర్కు ఇలాంటి అనుభవాలే ఎదురవుతుండటం విశేషం. మా ప్రభుత్వం ఫలానా పనులు చేసింది, ఫలానా పథకాలు పెట్టింది. ఈ పథకాల ద్వారా ఇంత మంది లబ్ది పొందారు.. మళ్లీ గెలిపిస్తే ఇప్పుడు చేసిన అభివృద్ధి కంటే డబుల్ చేసి చూపిస్తామని చెప్పాల్సింది పోయి.. ఇలా మాట్లాడటం ఏంటని సభకు వచ్చిన ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
విశ్రాంతి తీసుకుంటాననే అంశం పై రచ్చ..! ప్రజాసమస్యలు పట్టవా అని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు..!!
పైగా ఎన్నికల్లో గెలవకపోతే తనకేం నష్టం లేదని చెప్పడం, ఓడిపోతే ఫాంహౌస్లో పడుకుంటానని జనాలను బ్లాక్ మెయిల్ చేయడం మరీ దారుణమనే చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ ఎందుకిలా అన్నారు..? ఏ మూడ్లో అన్నారు? దీని వెనుక ఆంతర్యం ఏమిటనే కోణంలో ప్రజల్లో చర్చలు ఊపందుకున్నాయి. మరోవైపు ప్రత్యర్థి పార్టీలకు మాత్రం ఇదో అస్త్రం అయిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్ వాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. పదవిలో ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుడు ఎప్పుడు ప్రజాసమస్యలపై ద్రుష్టి పెట్టాలిగాని, పదవిలేకపోతే ఇంటో విశ్రాంతి తీసుకుంటా అని వ్యాఖ్యానించండం ఏంటని ప్రశ్నించారు.