మనకు అనుకూలం: ఎన్నికల షెడ్యూల్పై కేసీఆర్, హైకోర్టులో కేసు పెండింగ్పై ఈసీ ఏమన్నదంటే?
హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీనిపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సమయం లేనందున ప్రచారం ధాటిగా ఉండాలని సూచించారు.
ఎన్నికలకు సరిగ్గా రెండు నెలలు ఉండటంతో అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పారు. ఇప్పటికే 105 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మరికొందరు అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లోను ఖరారు చేసిన తర్వాత, 14 నియోజకవర్గాలకు కలిపి ఈ నెల 9వ తేదీ తర్వాత ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
ఎన్నికల తేదీపై కేసీఆర్ సంతృప్తి
ఎన్నికల తేదీపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్లో ఎన్నికలు రావడంపై ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ మనకు అనుకూలమేనని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కేసీఆర్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారని తెలుస్తోంది. వారితో మాట్లాడి ప్రచారంపై ఆరా తీశారు.
ఎన్నికల ప్రచారంపై తర్జన భర్జన
అంతకుముందు, ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ నేతలతో చర్చించారు. ఎన్నికల ప్రచార సభలను జిల్లాల వారీగా జరపాలా లేక నియోజకవర్గాల వారీగా నిర్వహించాలా అనే అంశంపై చర్చించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు మరో రెండు నెలలు గడువు ఉంది. అరవై రోజుల సమయం ఉంది కాబట్టి నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
పండుగ రోజుల్లో సభలపై డైలమా
దసరా, బతుకమ్మ పండుగలు తెలంగాణకు ఎంతో ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ రోజుల్లో సభ నిర్వహణపై కేసీఆర్, ఇతర తెరాస నేతలు చర్చించారు. పండుగల రోజుల్లో సభలు వద్దని కొందరు నేతలు చెబితే, ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిర్వహించుకోవచ్చునని మరికొందరు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. దీనిపై మూడ్రోజుల్లో తేల్చనున్నారని సమాచారం.
హైకోర్టులో కేసు పెండింగ్పై ఈసీ ఏమన్నదంటే
మరోవైపు, తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్ల గురించి తమ అధికార బృందం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందామని, అందుకే తాము అక్కడికి వెళ్లకుండానే నాలుగు రాష్ట్రాలతో కలిపి ఆ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకటించామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. ఓటర్ల జాబితాను చూపించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో కోర్టు ఇచ్చే తదుపరి ఉత్తర్వుల ఆధారంగా నడుచుకుంటామన్నారు. తెలంగాణ పర్యటనకు కమిషన్ వెళ్లలేదనడం, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండడం నిజమేనని, ఓటర్ల తుది జాబితా ను హైకోర్టుకు చూపించడం కోసం ప్రచురణ తేదీని 8 నుంచి 12వ తేదీకి పెంచామన్నారు. అన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఎన్నికలను చివరి దశలో పెట్టామన్నారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సమయం ఉంటుందని, తాము తెలంగాణ పర్యటనకు వెళ్లి ఉండాల్సి ఉందని, అయితే అధికార బృందం రాష్ట్రంలో పర్యటించి అన్ని విషయాలను సమీక్షించిందని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రాష్ట్ర యంత్రాంగంతో మాట్లాడిందని, తమకు నివేదిక ఇచ్చిందని, శుక్రవారం సీఈఓని పిలిపించి మాట్లాడామని, ఆయన చెప్పిన అన్ని అంశాలపై కమిషన్ సంతృప్తి చెందిన తర్వాతే ఈ షెడ్యూల్లో తెలంగాణను చేర్చామని, తాము ఇంతవరకూ మిజోరం రాష్ట్రానికీ వెళ్లలేదని, త్వరలో వెళ్తామని, అలాగే తెలంగాణకూ వెళ్లి పరిశీలిస్తామని, అక్కడికి వెళ్లనంత మాత్రాన ఎన్నికల ఏర్పాట్ల గురించి సంతృప్తి చెందలేదనడానికి వీల్లేదని చెప్పారు. తెలంగాణలో ఫలానా పార్టీకే ఓటేస్తామంటూ బహిరంగంగా చేస్తున్న ప్రమాణాల విషయాన్ని పరిశీలిస్తామన్నారు.