ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులపై కేసీఆర్ వరాలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, సీఐడీ విభాగాల్లోని ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. క్యాంపు ఆఫీసులో శుక్రవారం ఉదయం ఆయా విభాగాలకు చెందిన ఉన్నాతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇంటెలిజెన్స్ విభాగంలో 464 మందికి, సెక్యూరిటీ విభాగంలో 893 మందికి, సీఐడీ విభాగంలో 646 మంది ఉద్యోగులకు మూలవేతనంపై 25 శాతం అలవెన్స్ ప్రకటించినట్లు వెల్లడించారు. దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగంగా జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు అదనంగా మరో రెండు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. బొగ్గుగని కార్మికులకు మెరుగైన వైద్యం కోసం కోల్ బెల్ట్ లో కూగీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
దీనిపై మంత్రులు, అధికారులు సమావేశమై ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించేందుకు శాఖల వారీగా సిఫారసులు రూపొందించామన్నారు. దీంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లకు చెల్లిస్తున్న వేతనాలను రెట్టింపుచేస్తూ గురువారం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ డ్రైవర్లకు ప్రస్తుతం రూ.7,100 వేతనం ఇస్తుండగా దానిని రూ.13,880కి పెంచారు.
కాంట్రాక్ట్ కండక్టర్ల వేతనం రూ.6,500 నుంచి రూ.12,610కు పెరిగింది. పెంచిన వేతనాలు ఈనెల నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీఎస్ఆర్టీసీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 4,300 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.