లోపం తలెత్తకుండా జాగ్రత్త వహించండి: జలజాలంపై కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంపై గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇంటింటికి మంచి నీళ్లు అందించబోయే వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు మంచి నీరు అందించడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయం కావడంతో అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.
ప్రాజెక్టు పనులపై కార్యాచరణను రూపొందించుకోవడంతోపాటు నిత్యం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. పథకం కోసం రాష్ట్ర ప్రజలతోపాటు దేశం మొత్తం ఆసక్తి కనబరుస్తోందన్నారు. ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.
నీటిని తరలించే విషయంపై అధికారులతో చర్చించి వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచినీరు అందించడం అత్యంత ప్రాధాన్యమైన విషయమన్నారు. ప్రాజెక్టు పనుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతీ రోజు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.
ఇక గ్రామ జ్యోతి పథకంపై 11న హైటెక్స్లో మంత్రివర్గ ఉప సంఘం, పంచాయతీరాజ్ అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సిఇఓలు, సిపిఓలతో సిఎం సమావేశం కానున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.