మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి: సంతోషంగా ఉందన్న కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ తదితర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నష్టం స్వల్పంగానే ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చెప్పారు.
వానల వల్ల తలెత్తిన పరిస్థితులపై సమీక్షించిన తర్వాత కెిసఆర్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నాయని, సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో భారీగా వర్షాలు వస్తున్నందున గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉందని, దీంతో ఐదు జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేశామని ఆయన చెప్పారు. గోదావరి తీర ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
ప్రాణ నష్టం పెద్దగా లేదని, నలుగురైదుగురు మరణించినట్లు సమాచారం ఉందని ఆయన చెప్పారు. మరో రెండు మూడు రోజులు చూసి నివేదిక రూపొందించి, కేంద్రానికి పంపించి సాయం కోరుతామని ఆయన చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పంట నష్టం కూడా స్వల్పంగానే జరిగిందని చెప్పారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారని చెప్పారు.
మరో రెండేళ్ల వరకు మనకు నీటి కష్టాలుండవని ఆయన చెప్పారు. వరంగల్లో మాత్రం నీళ్లు వచ్చాయని, సహాయకపునరావాస చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తాయని, కాస్తా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
ఎస్ఆర్ఎస్పి, సింగూరు ప్రాజెక్టులు నిండాయని, నిజాం సాగర్ ప్రాజెక్టు ఈ రాత్రికి నిండుతుందని ఆయన చెప్పారు. నాగార్జునసాగర్ మాత్రమే నిండాల్సి ఉందని ఆయన చెప్పారు.
వరదల్లో చిక్కుకున్న కూలీలు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో మంజీరానది పొంగి పొర్లుతోంది. ఏడుపాయల్లోని ఓ గడ్డపై 23 మంది భవన నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వీరంతా మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన కార్మికులు. మంజీరా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో వారిని వీలైనంత త్వరగా రక్షించాలని తెలంగాణ ఉప సభాపతి పద్మదేవేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే, అక్కడికి హెలికాప్టర్లు వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదు.
నిజాంబాదులో రికార్డు స్థాయి వర్షం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 1989లో 35.5 సెం.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తెలంగాణలో ఒకే రోజు ఒకే ప్రాంతంలో 39 సెం.మీ.ల వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ తెలిపింది.
మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి
తెలంగాణ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కదులుతోంది. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదిలాబాదు జిల్లాలో కుండపోత
ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ భారీ వర్షాలకు జైనథ్, బేల, తాంసీ, గుడిహత్నుర్, తలమడుగు మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని బంగారుగూడ వాగులో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. జైనథ్ మండలంలోని జామ్నీలో పిడుగుపాటుకు ఇద్దరు గాయపడ్డారు.
మ్యాన్ హోల్ నుంచి తప్పించుకున్న యువకుడు
హైదరాబాదులోని నిజాంపేటలో శనివారం ఓ యువకుడు తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. శ్రీనివాస్నగర్లోని ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు మ్యాన్హోల్లోకి జారిపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో రహదారి పూర్తిగా వరద నీటిలో మునగడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఆ యువకుడు వాహనంతో సహా మ్యాన్హోల్కు దిగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతడ్ని రక్షించడంతో పెను ప్రమాదమే తప్పింది.
జూరాలకు జలకళ
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాలు అయిన కర్ణాటక, మహరాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఎక్కువగా రావడంతో దిగువకు వదిలిపెట్టారు. అలమట్టి లోకి 45,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా అవుట్ ఫ్లో ద్వారా 45,000 క్యూసెక్కులు దిగువకు వదులు తున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 67,000 క్యూసెక్కులు ఉండగా.. 63,000 క్యూసెక్కుల నీరు జూరాలకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97,000 క్యూసెక్కులు ఉండగా... అవుట్ ఫ్లో 97,000 క్యూసెక్కులు గా ఉంది.
ఏడు గేట్ల ద్వార నీటిని దిగువ శ్రీశైలంప్రాజెక్టుకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం ౩18.516 మీటర్లు కాగ ప్రస్తుతం ౩18.500 మీటర్లకు చేరుకుంది. 6 యానిట్ ల ద్వార విద్యత్ ఉత్పత్తి చేస్తున్నారు.