జూబ్లీ, బంజారాహిల్స్లో పేదలకు ఇళ్లు: కెసిఆర్(ఫొటో)
హైదరాబాద్: పేదలకు కూడా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి విలువైన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేలా ఆలోచించి, ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు సేకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో పేదల గృహ నిర్మాణంపై దాదాపు నాలుగు గంటలపాటు అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు.
నగరంలో 2.10 లక్షల మంది నిరుపేదలకు సొంత ఇళ్లు లేవని సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందని, వీరందరికీ బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లు నిర్మించడానికి 2వేల ఎకరాల స్థలం కావాలని సీఎం పేర్కొన్నారు. ఈ భూమి సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదలందరికీ ప్రభుత్వమే ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు కట్టించి ఇస్తుందని చెప్పారు.
నిరుపేదల ఇళ్లంటే ఎక్కడో విసిరేసినట్లు దూరంగా ఉండకూడదన్నారు. నగరం మధ్యలోనే ఇళ్లు ఉండాలన్నారు. వీలైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే పేదలకు ఇళ్లు కట్టాలని ఆదేశించారు. రూ1.15 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్న రాష్ట్రంలో నిరుపేదల ఇండ్లకోసం నిధుల కొరత అనే సమస్య ఉండదని స్పష్టంచేశారు.
నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు పదుల ఎకరాలు, చిన్నపాటి విద్యాసంస్థలకు వందల ఎకరాలు, యూనివర్సిటీలకు వేల ఎకరాలు, వివిధ క్లబ్బులకు పెద్ద మొత్తంలో భూములు గతంలో కేటాయించారని సీఎం చెప్పారు. వాటిల్లో చాలా భాగం నిరుపయోగంగానే ఉన్నాయని, వాటిని పేదల ఇంటి నిర్మాణంకోసం ఉపయోగించాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ఇళ్లు లేని పేదలు ఎవరూ ఉండకూడదని అన్నారు.
భూసేకరణ జరిపిన తరువాత ఆ భూమిని స్వాధీనం చేసుకొని 2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, రెవెన్యూ కార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, హైదరాబాద్ సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.