ఆ గ్రామాల్ని చంద్రబాబు వెనక్కిస్తారు, మేం ఏపీకి సాయం చేస్తాం: కెసిఆర్
హైదరాబాద్/ఖమ్మం: ఏపీలో కలిసిన నాలుగైదు గ్రామాలను వెనక్కి ఇవ్వడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని, త్వరలోనే అవి మనకు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు అన్నారు.
ఏపీలో ఉన్నది కూడా కూడా తెలుగువారేనని, వారికి కావాల్సిన సాయం మేం చేస్తామన్నామని చెప్పారు. కెసిఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడారు. భద్రాచలం ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు.
ఖమ్మం జిల్లాలో మైనింగ్ విశ్వవిద్యాలయం, లేనిపక్షంలో కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఆ దిశగా సమాలోచనలు సాగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కి పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.
జిల్లా పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలను పునర్విభజన చేయాలా? అంతకు ముందే చేయాలా అనే విషయమై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. తప్పకుండా ఖమ్మం జిల్లా రెండు జిల్లాలు అవుతుందన్నారు.
కాగా, రెండు ప్రాజెక్టులు జిల్లాకు వరప్రదాయిని. రూ.8 వేల కోట్లతో నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతలతో జిల్లాలో 5.50 లక్షల ఎకరాలకూ, రూ.92 కోట్లతో నిర్మించే భక్తరామదాసు ఎత్తిపోతలతో 60 వేల ఎకరాలకూ సాగునీరు అందుతుందని, ఈ రెండింటిని యుద్ధప్రాతిపదికన నిర్మిస్తామని కెసిఆర్ చెప్పారు.
రోళ్లపాడు వద్ద 19 టీఎంసీలతో రిజర్వాయర్ను నిర్మించబోతున్నామని, తద్వారా ఎన్ఎస్పీ ఆయకట్టుకు కూడా సాగునీరు అందించే వెసులుబాటు లభిస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లా, నగరం కావాల్సినంత అభివృద్ధి జరగలేదని కెసిఆర్ చెప్పారు.