సెక్షన్ 8: సీఎంలకు కేసీఆర్ ఫోన్, గవర్నర్కు చెప్పేశారు, మరింత చిచ్చు: గుత్తా
హైదరాబాద్: హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయవచ్చున్న అటార్నీ జనరల్ సూచనల పైన తెలంగాణ రాష్ట్ర సమితి అసహం వ్యక్తం చేస్తోంది. సెక్షన్ 8 అమలు చేస్తే జాతీయస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ పెద్దలకు ఫోన్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని సెక్షన్ 8ను ఉపయోగిస్తూ హైదరాబాద్పై గవర్నర్కు అధికారాలు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించేందుకు సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. తామంతా కేసీఆర్తో కలిసి వస్తామని వారు హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గవర్నర్కు చెప్పిన సీఎం!
హైదరాబాదులో సెక్షన్ 8కు ఎట్టి పరిస్థితుల్లోను తాము అంగీకరించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్కు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఏపీ వారి పైన ఎక్కడా దాడులు జరగలేదని చెప్పారని తెలుస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఆటంకాలు సృష్టిస్తున్నారని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
మరింత చిచ్చుపెట్టేలా: గుత్తా
సెక్షన్ 8 అంశం ఇరు రాష్ట్రాల మధ్య మరింత చిచ్చుపెట్టేలా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అటార్నీ జనరల్ సూచనలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింత పెంచేవిధంగా ఉన్నాయని, ఆయన సూచనలు అర్థవంతంగా లేవన్నారు. పిచ్చితనంతో కూడినట్లు ఉన్నాయన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంతో గవర్నర్కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఆయన ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్ల మధ్య ఒప్పందం కుదిరితే వీరిద్దరికి ప్రజలు మంగళం పాడుతారని మండిపడ్డారు.
పెత్తనం చెలాయిస్తే ఒప్పుకోం: కోదండరాం
సెక్షన్ 8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై ఏపీ నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే అంగీకరించే ప్రసక్తి లేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. సెక్షన్-8 పరిధి చాలా చిన్నదని, గవర్నర్ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
హైదరాబాదులో ఇప్పటి వరకు శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగలేదని అలాంటప్పుడు సెక్షన్ 8 ఎందుకని అడ్వోకేట్ శ్రీరంగరావు ప్రశ్నించారు. అవినీతి కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి బయటపడే మార్గంలేక ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యను ఆంధ్ర ప్రజల సమస్యగా సృష్టిస్తున్నడని రాజకీయ విశ్లేషకులు వీ ప్రకాశ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సెక్షన్-8ను అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు.