చుక్కెదురు: కెసిఆర్కు నో చెప్పిన నరేంద్ర మోడీ
ముస్లిం రిజర్వేషన్లపై అఖిల పక్ష బృందాన్ని తీసుకుని హైదరాబాదు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రయత్నానికి చుక్కెదురైంది.
హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లపై అఖిల పక్ష బృందాన్ని తీసుకుని హైదరాబాదు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రయత్నానికి చుక్కెదురైంది. సమయం లేకపోవడంతో ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేమని పిఎంవో తేల్చి చెప్పింది.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ, అందుకు రాజ్యాంగం ద్వారా వెసులుబాటు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరడానికి కెసిఆర్ ప్రధాని వద్దకు అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకుని వెళ్లాలని భావించారు. ప్రధానికి సమర్పించడానికి రెండు వినతి పత్రాలను కూడా తయారు చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరపాలని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి వెసులుబాటు కల్పించాలని కోరడానికి కెసిఆర్ ఆ వినతిపత్రాలను సమర్పించారు.
సమయం లేదంటూ..
అఖిల పక్ష ప్రతినిధి బృందాలను కలవడానికి ప్రధానికి సమయం లేదని ముఖ్యమంత్రి శనివారంనాడు పిఎంవో నుంచి సమాచారం అందింది. ఆ రెండు వినతపత్రాలను కూడా ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్బంగా అఖిల పక్ష ప్రతినిధి బృందాలతో కలిసి మర్పించాలని అనుకున్నారు.
నిరాశ చెందిన కెసిఆర్...
పిఎంవో నుంచి సానుకూల సమాచారం రాకపోవడంతో కెసిఆర్ తీవ్ర నిరాశకు లోనైనట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానిని కలుద్దామని కెసిఆర్ అప్పటికే బిజెపి, టిడిపి, సిపిఐ, సిపిఎం, మజ్లస్ పార్టీలకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు అది సాధ్యం కాదని తేలడంతో కెసిఆర్ అసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.
కారణం ఇదట...
గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నందున ప్రధాని నరేంద్ర మోడీకి తీరిక లేదని, అందువల్ల అఖిల పక్ష బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వలేమని పిఎంవో కెసిఆర్కు తెలియజేసినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై విన్నవించుకోవడానికి అఖిల పక్ష బృందానికి ఇచ్చిన అపాయింట్మెంట్ను నరేంద్ర మోడీ రద్దు చేసుకున్నారు. దాంతో ఈసారి కచ్చితంగా ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తుందనే ఆశతో ఉన్న కెసిఆర్కు నిరాశే ఎదురైంది.
జంతర్ మంతర్ వద్ద ధర్నా
ముస్లిం రిజర్వేషన్లపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి హైదరాబాద్ పర్యటనలో ఓ వినతిపత్రం సమర్పించాలని అనుకున్నారు. ఈ ధర్నాకు డిఎంకె నాయకుడు స్టాలిన్ మద్దతు ప్రకటించారు.