మాట నిలబెట్టుకున్న కేసీఆర్: శ్రీజ ఇంటికి వెళ్లారు, గొలుసు ఇచ్చిన కవిత
హైదరాబాద్: 'ఏమ్మా బాగున్నావా.. మీ ఇంటికి వస్తానని, ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని హైదరాబాద్లో ఇటీవల నన్ను కలిసినప్పుడు మాటిచ్చా. ఇచ్చిన మాట తప్పకుండా ఇప్పుడు మీ ఇంటికొచ్చా' అని ఖమ్మం నగరంలోని ఉపేంద్రయ్యనగర్కు చెందిన చిన్నారి లక్ష్మీ శ్రీజతో సీఎం కేసీఆర్ ముచ్చటించారు.
నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన లక్ష్మీ శ్రీజ తల్లిదండ్రులతో సహా హైదరాబాద్లో కలిసి నప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రపై తన ప్రతిభను అనగర్గళంగా ప్రదర్శించడంతో చిన్నారి మేధస్సును మెచ్చి తన సొంత ఖాతా నుంచి రూ. 10 లక్షలను అందజేసి అభినందించిన విషయం విదితమే.
టీఆర్ఎస్ ప్లీనరీలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి ఖమ్మం చేరుకున్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం సాయంత్రం శ్రీజ ఇంటిని సందర్శించారు. ముఖ్యమంత్రిని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు శ్రీజ ఇంటికి తీసుకెళ్లారు. దాదాపు 20 నిమిషాల పాటు ముచ్చటించారు.
కుశల ప్రశ్నలతో సీఎం సరదాగా చిన్నారితో ముచ్చటించారు. పెద్దయ్యాక ఏమవుతావని ప్రశ్నించగా.. ఐఏఎస్ అవుతానని చిన్నారి బదులిచ్చింది. ఐఏఎస్ అంటే ఏమిటని అడగ్గా.. లక్ష్మీ శ్రీజ వెంటనే సరైన సమాధానం చెప్పింది. శ్రీజ కుటుంబసభ్యులు ఇచ్చిన బ్లాక్ టీని ఆస్వాదించారు.
హైదరాబాద్లో మంచి స్కూల్ ఎంపిక చేసి శ్రీజను చేర్పించాలని సీఎం తన కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితకు సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత తీసుకొచ్చిన బంగారు గొలుసును శ్రీజ మెడలో వేసి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్లీనరీలో రెండు నిమిషాల పాటు ప్రసంగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు లక్ష్మీశ్రీజకు తెలిపారు.
సీఎం కేసీఆర్తో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత ఉన్నారు. శ్రీజ తల్లిదండ్రులు వేల్పుల కిరణ్కుమార్, సుధారాణి, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, మచ్చా నరేందర్, టీఆర్ఎస్ నాయకుడు కూరాకుల నాగభూషణం తదితరులు వారికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ను చూసేందుకు చుట్టు ప్రక్కల పజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు. లక్ష్మీశ్రీజతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం కేసీఆర్ గొల్లగూడెంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన రాత్రికి అక్కడే బస చేశారు.
ప్లీనరీ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, మహబూబాబాద్, పెద్దపల్లి ఎంపీలు సీతారాంనాయక్, బాల్క సుమన్, మంత్రి చందులాల్ తదితరులు కూడా ఖమ్మం చేరుకున్నారు.