టిడిపి ర్యాలీని చూసి నవ్విన కెసిఆర్: అర్థమేమిటి? (పిక్చర్స్)
హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాదులోని ట్యాంక్బండ్ వద్ద గురువారంనాడు గమ్మత్తయిన సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకుల నిరసన ర్యాలీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రత్యక్షంగా చూశారు.
ట్యాంక్బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి మీడియాతో మాట్లాడిన తర్వాత టిడిపి నాయకులు పాదయాత్ర చేస్తూ ఎన్టీఆర్ ఘాట్కు బయలుదేరారు. ర్యాలీ సచివాలయం వద్దకు చేరుకున్న సమయంలో సీఎం కాన్వాయ్ ఖైరతాబాద్ వైపు వెళ్లింది.
కాన్వాయ్ ఈ ర్యాలీ వద్దకు చేరుకోగా ముఖ్యమంత్రి కెసిర్ తాను ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి చిరునవ్వు చిందించారు. కెసిఆర్ నవ్వులోని ఆంతర్యమేమిటని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. టిడిపిని దాదాపుగా ఖాళీ చేశాననే ధీమాతోనో, మీరేం చేయగలరనే ఉద్దేశంతోనో కెసిఆర్ నవ్వి ఉంటారని భావిస్తున్నారు.
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా...
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన కోసం తమ పార్టీ చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.
అంబేడ్కర్ కారణం...
చాయ్వాలాగా జీవితాన్ని ఆరంభించిన నరేంద్రమోదీ ఈ దేశానికి ప్రధాని అయ్యారంటే దానికి కారణం అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలేనని రమణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ కేబినెట్లో మహిళలకు, దళితులకు స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు.
జూన్లోగా కేటాయించాలి...
జూన 2లోగా దళితులు, మహిళలకు కీలక శాఖలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తిని, ఎన్టీఆర్ ఆశయాలను అద్దంపట్టే విధంగా ఏపీ రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ఏర్పాటు చేయడం అభినందనీయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
చోటు ఉండదా...
తెలంగాణ కేబినెట్లో మాలలు, మాదిగలు, మహిళలకు చోటు కల్పించకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం తమ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.
సుజనా చౌదరి ఇలా...
ఎన్టీఆర్ భవనలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి సుజనాచౌదరి మాట్లాడారు. సమాజంలో అంటరానితనం, అసమానతలు తొలగించడానికి అంబేడ్కర్ ఎంతగానే కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ టిడిపి నేతలు
పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఇ. పెద్దిరెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దళితులు, మహిళల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు.
ఎలుకను తిన్న పిల్లి..
ఎలుకను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తూ మభ్యపెట్టడానికే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.