అందుకే వరంగల్లో కేసీఆర్: రేవంత్, జనంలోకి సీఎం
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం ధ్వజమెత్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో వలసలు, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
సమస్యలు ఉన్న జిల్లాల్లో కేసీఆర్ ఎందుకు పర్యటించలేదో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న అబద్దాలకు అంతేలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా విద్యుత్ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
కేవలం మున్సిపల్ ఎన్నికల్లో విజయం కేసం కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లను ఏఱ్పాటు చేస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే, వాటికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేవన్నారు. రోజు అబద్దాలు చెప్పి ఆయన పబ్బం గడుపుకుంటున్నారన్నారు.
వరంగల్లో కేసీఆర్...
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం వరంగల్ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అర్హులకు పింఛను, ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. జనం మధ్యలోకి వెళ్లి అర్హులకు పింఛన్, ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాబోయే రెండు మూడేళ్లలో దారిద్ర్యం నుండి బస్తీవాసులు బయటపడాలన్నారు. చరిత్రలో ఏ సీఎం కూడా వరంగల్లో నాలుగు రోజులు ఉండలేదన్నారు. బస్తీవాసుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే వేగంగా అభివృద్ధి సాధిస్తామన్నారు. అంతకుముందు ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.