జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి: అభ్యర్థులపై కేసీఆర్ అసంతృప్తి! వారికి పదవులు ఎర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్రంలోని 115 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 50 రోజుల వ్యవధిలో అన్ని నియోజకవర్గాల్లో తిరగనున్నారు. ఇందుకు సంబంధించి ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది. కేసీఆర్ గత నెల 7వ తేదీన హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్, నల్గొండ, వనపర్తి, సభల్లో పాల్గొన్నారు.
మూడు రోజుల క్రితం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అందుకు అనుగుణంగా ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే తిరిగిన నాలుగు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకునన్నారు.
కేసీఆర్ ఆ సీట్లు సాధిస్తారా? నాటి బలం ఇదీ, కానీ సెంచరీకి చేరువ: మేనిఫెస్టో రహస్యం!
రోజుకు రెండు మూడు సభల్లో పాల్గొనే ఛాన్స్
ఒక రోజుకు రెండు మూడు సభల్లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ప్రచారానికి ఎప్పుడు రావాలనే అంశంపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారని సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల్లోని అసంతృప్తులు, పార్టీలలోని ఇబ్బందుల బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులకు కూడా అప్పగించారని తెలుస్తోంది.
పలువురు అభ్యర్థులపై అసంతృప్తి
పలు నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు వచ్చే వరకు ప్రచారం చేద్దామనే ఆలోచన చేయవద్దని, వారు వచ్చినా రాకున్నా ప్రచారం ప్రారంభించాలని కేసీఆర్ నేతలు, కార్యకర్తలకు సూచించారు. పలు గ్రామాల్లో అభ్యర్థుల కోసం వేచి చూడటం సరికాదని, ప్రచారంలో దూసుకెళ్లాలని చెప్పారు. ఇంటింటికి ప్రచారం చేయాలన్నారు. మరోవైపు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఎన్నికలు ముగిసే వరకు తమ తమ నియోజకవర్గాలను వీడవద్దని కేసీఆర్ సూచించారు. పలువురికి ఫోన్ చేసి చెప్పారు. కొందరు అభ్యర్థులు సొంత పనుల కోసం తరుచూ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు నెలలు ఎంతో కీలకమని, నియోజకవర్గంలోనే ఉండాలన్నారు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి
పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను స్థానికులు నిలదీస్తున్నారు. కొందరు చాలా రోజులకు తమ ప్రాంతానికి రావడంపై.. ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చామా అని, సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ సమస్యలపై స్థానికులు స్పందిస్తే వాటికి సరైన విధంగా సమాధానం చెప్పాలని సూచించారు. టీఆర్ఎస్ హయాంలో ఏ ప్రయత్నం జరిగింది, గతంలో ఏం జరిగిందనే అంశాలు వారికి తెలియజెప్పాలన్నారు.
అసంతృప్తులకు పదవులు ఎర
ఇదిలా ఉండగా, అసంతృప్తుల పైన కేసీఆర్ దృష్టి సారించారు. స్టేషన్ ఘనపూర్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మానకొండూరు తదితర ఎన్నో నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవి ఉద్రిక్తతకు కూడా దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురికి ఎమ్మెల్సీ, కార్పోరేషన్ చైర్మన్ పదవులు వచ్చేలా చేస్తామని కేసీఆర్ హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నచోట ఇతర పార్టీల నుంచి నాయకులను ఆహ్వానించాలని కూడా సూచించారని తెలుస్తోంది.