చంద్రబాబు సీఎం ఇంటికొచ్చారు, కెసిఆర్ బెజవాడ వెళ్తారు: టిఆర్ఎస్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఇంటికి వచ్చి నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించినందున తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా విజయవాడకు వెళ్లి చంద్రబాబును చండీయాగానికి ఆహ్వానిస్తారని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
అక్టోబర్ 22వ తేదీన అమరావతి శంకుస్థాపన కోసం చంద్రబాబు స్వయంగా కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ కూడా విజయవాడకు వెళ్లి ఆయనకు ఆహ్వానం పలకాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాదులో కాకుండా బెజవాడలో కలవాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ నుంచి ఏపీకి పలు శాఖలు తరలి వెళ్తున్నాయి. ఏపీ సీఎంగా బెజవాడలో చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక ఇవ్వనున్నారు.

కెసిఆర్ నిర్వహించనున్న ఆయత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరు కానున్నారు. ఆయన ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో యాగానికి వస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ 18వ తేదీన శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో తెలంగాణ సిఎస్ పోలీసులతో పలు శాఖల అధికారులతో భేటీ అయ్యారు.
కాగా, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్లు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూతురు వివాహ విందులో తారసపడ్డ విషయం తెలిసిందే. వారు పరస్పరం అభివాదం చేసుకున్నారు. చేయి కలిపి కాసేపు ముచ్చటించారు.
జైట్లీ కుమార్తె సోనాలి వివాహ విందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications