కెసిఆర్కు చైనా 'లియో' రూ.వెయ్యి కోట్ల హామీ, ఫోటోలు దిగారు (పిక్చర్స్)
బీజింగ్: తన చైనా పర్యటనలో తెలంగాణ సీఎం కెసిఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. డాలియన్లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన కేసీఆర్ ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు నెలకొన్న అనువైన వాతావరణాన్ని ప్రపంచం దృష్టికి తేనున్నారు.
అందులో భాగంగా... రాష్ట్రంలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లియోగ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తమ తమ కంపెనీలను సందర్శించాలని, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించాలని పలు కంపెనీల నుంచి కేసీఆర్ బృందానికి ఆహ్వానాలు వచ్చాయి.
కెసిఆర్... ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తొలి రోజైన బుధవారం ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్రోడ్స్ అనే అంశంపై జరిగే చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. వర్థమాన దేశాల మార్కెట్ల అభివృద్ధికి గల అవకాశాలపై ప్రపంచ నేతలతో కలిసి ఆయన చర్చించనున్నారు.
కెసిఆర్
సోమవారం రాత్రి చైనాలోని డాలియన్ నగరానికి చేరుకున్న కెసిఆర్ బృందం మంగళవారం ఉదయంనుంచే బిజీబిజీగా గడిపారు. ఉదయం చైనాలో భారత రాయబారి అశోక్ కే కాంత, ఆయన అధికారులతో సీఎం బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.
కెసిఆర్
చైనాలో పరిస్థితులు, పరిశ్రమలు, సంస్థలగురించి సీఎం కేసీఆర్కు ఆయన వివరించారు. చైనాలో కంపెనీల అవకాశాలతోపాటు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను భారత రాయబారి అశోక్ సీఎం కేసీఆర్కు వివరించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్)ను కెసిఆర్ వివరించారు.
కెసిఆర్
లియానింగ్ స్టేట్లోని టాప్ 30 కంపెనీల సీఈవోలతో సీఎం కేసీఆర్ మూడు గంటల పాటు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలాంశాలను చర్చించారు. చైనాలోని బారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా (లియానింగ్ ప్రొవిన్షియల్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్) ఆతిథ్యంలో ఎంటర్ప్రైజెస్ ఇంటరాక్షన్ సమావేశం జరిగింది.
కెసిఆర్
ఈ సందర్భంగా పలువురు సీఈవోలు తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసిస్తూ తాము పెట్టుబడులు పెడతామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానాలు చెప్పారు. అంతకుముందు లియో గ్రూపు కంపెనీల ఛైర్మన్ లియోవాంగ్ అంతకుముందు సీఎంను కలిశారు. భేటీ సందర్భంగా తెలంగాణలో రూ.1000 కోట్లతో హెవీడ్యూటీ పంపుల పరిశ్రమ స్థాపిస్తామని లియోవాంగ్ ప్రకటించారు.
కెసిఆర్
దీనికి డాలియన్ మున్సిపల్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్షిప్ విత్ ఫారిన్ కంట్రీస్, డాలియన్లోని తైలింగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు సహకరించాయి. తొలి రోజు పర్యటనలో భాగంగా డాలియన్లోని పలు ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి, పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఫోటోలు దిగారు. చైనాలో భారత రాయబారి అశోక్ కే కాంత అక్కడి విశేషాలను, సమాచారాన్ని అందించారు.
కెసిఆర్
చైనా అంతర్జాతీయ వ్యాపార ప్రోత్సాహక మండలి అధ్యక్షుడు జియాడె యె సీఎంను కలిసి భారత్లో పెట్టుబడులకు చైనా కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఈ నెల 14న షెంజేన్ నగరాన్ని సందర్శించాలని అభ్యర్థించారు.
కెసిఆర్
ఈ సందర్భంగా వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక అంశాలపై పరస్పర సహకారం కోసం చర్చిద్దామన్నారు. దీనికి కెసిఆర్ అంగీకరించారు. అనంతరం డేలియన్లోని హోటల్లో రాత్రి పూట చైనా, భారతీయ పారిశ్రామికవేత్తలిచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు.