జూబ్లీహిల్స్ లో గెలుపు పై రేవంత్ ధీమా వెనుక - గ్రౌండ్ రిపోర్ట్..!!
జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది. ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి పెంచుతున్న అంశం. ఉప ఎన్నిక వేళ పోరు హోరా హోరీగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ - బీజేపీ మధ్య మాటల యుద్దం సాగుతోంది. అయితే, ఇక్కడ సర్వే రిపోర్ట్స్ ఎలా ఉన్నా.. రేవంత్ ధీమా వెనుక కీలక అంశాలు ఉన్నాయి. అసలు జూబ్లీ హిల్స్ లో గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెబుతోంది..
జూబ్లీహిల్స్ లో మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ కు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సీఎం రేవంత్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సైతం గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. మూడు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు నియోజకవర్గంలో మోహరించారు.బీఆర్ఎస్ పూర్తిగా సెంటిమెంట్ తో పాటుగా ప్రభుత్వం పైన చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.

కాగా, కాంగ్రెస్ మాత్రం సెంటిమెంట్ పని చేయని అంశాన్ని గుర్తు చేస్తోంది. సిట్టింగ్ శాసనసభ్యులు మరణంతో ఉప ఎన్నికలు జరిగిన పాలేరు, దుబ్బాక, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ అక్కడ సెంటిమెంట్ పనిచేయలేదని చెబుతోంది. ఉప ఎన్ని కల్లో సెంటిమెంట్ కంటే డెవలెప్ మెంట్ కే అధిక ప్రాధాన్యత ఇస్తారని నమ్ముతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ బస్తీల్లో తిరుగుతున్నారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కులాలు, మతాల వారీగా కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంంది. ముఖ్యమంత్రి పలు సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యులతో సమావేశమవుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. మంత్రులు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం పెరిగితే ఖచ్చితంగా తమకు అనుకూలంగా మారుతోందని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేస్తున్నారు. కంటోన్మెంట్ తరహా ఫార్ములా ఇక్కడా అమలు చేస్తున్నారు. సీఎంతో సహా మంత్రులు.. పార్టీ నేతలు ఇక్కడే మకాం వేస్తూ జోరుగా ప్రచారం చేస్తుండటం.. ప్రతీ ఇంటికి వెళ్తుండటంతో ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. సర్వేలు ఎలా ఉన్నా.. తుది గెలుపు తమదేనని రేవంత్ ధీమాగా ఉన్నారు. కాగా, అసలు ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది 14న తేలనుంది.












Click it and Unblock the Notifications