రోహిత్ సోదరుడికి గుమస్తా ఉద్యోగమా?: కేజ్రీపై మండిపడ్డ హెచ్సీయూ విద్యార్ధులు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్ధి రోహిత్ వేముల సోదరుడికి సానుభూతితో చూడదగు కారణం కింద గుమస్తా ఉద్యోగం ఇస్తూ జాబ్ లెటర్ను పంపింది. అయితే పాండిచ్చేరిలోని సెంట్రల్ యూనివర్సిటీలో జియాలజీ విభాగంలో ఎమ్మెస్సీ చేసిన రాజా వేముల దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఫిబ్రవరి 24వ తేదీన ఢిల్లీలో రోహిత్ వేముల తల్లిని కలిసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజా వేములకు ఉద్యోగం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజా వేములకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం జాబ్ లెటర్ను పంపింది. దీనిపై స్పందించిన రాజా వేముల ఉద్యోగావకాశాన్ని ఇచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ధన్యవాదాలు తెలిపారు.
తన సోదరుడు రోహిత్ వేముల బ్రతికి ఉన్నప్పుడు తనని విదేశీ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేయాల్సిందిగా కోరాడని తెలిపాడు. నా సోదరుని కోరికను నెరవేర్చడమే తన ముందు ఏకైక లక్ష్యమని చెప్పాడు. తాను చనిపోయి ఏ లోకంలో ఉన్నా గర్వంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. కాగా హెచ్సీయూ విద్యార్ధులు కొంతమంది కేజ్రీవాల్ ప్రభుత్వం చీఫ్గా గుమాస్తా ఉద్యోగం ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.
రాజా వేముల పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి జియాలజీ విభాగంలో 72.8 శాతంతో ఉత్తీర్ణత సాధించాడని చెప్పుకొచ్చారు. అలాంటి తెలివితేటల గల వ్యక్తికి గుమాస్తా ఉద్యోగం ఇచ్చి అవమానించారని మండిపడ్డారు. అంతేకాదు రాజా వేముల ఎన్ఈటీ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించినందున అతడికి ఏ కాలేజీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం వస్తుందని అన్నారు.
రోహిత్ కుటుంబం ఢిల్లీ వచ్చినప్పుడు రాజాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని కోరగా... కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించి ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే సానుభూతితో చూడదగు కారణం కింద సీఎం కేజ్రీవాల్ కేవలం గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగలరని తెలిపారు.