టార్గెట్ కేసీఆర్ : తెలంగాణపై కేజ్రీవాల్ ఫోకస్.. ఏప్రిల్ 14 నుంచి ఆప్ పాదయాత్ర..!!
దేశ రాజధాని ఢిల్లీని ఎలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. పంజాబ్ లో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి మట్టికరిపించింది. దీంతో మంచి జోష్ ఉన్న ఆప్.. ఇప్పుడు దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాగా వేసేందుకు ఫోకస్ పెట్టింది. రానున్న రోజుల్లో కేంద్రంలో చక్రం తిప్పబోయేది తామేనని అధినాయకత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులను సిద్ధంచేస్తోంది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటాలకు సిద్ధమవుతోంది.
Recommended Video
తెలంగాణపై ఆప్ ఫోకస్
దక్షిణాదిలో కీలకంగా ఉన్న తెలంగాణపై ఆప్ అధినేత కేజ్రీవాల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి కేంద్రీకరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలో ఉన్న సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతోంది. ఏప్రిల్ 14వ తేది నుంచి తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్నట్లు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ సోమనాథ్ భారతి తెలిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రజలకు దగ్గరయ్యేలా ఆప్ పాదయాత్ర
ఇప్పుడు ఆప్ నేతలు కూడా .. పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువైయ్యేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఆప్ లక్ష్యాలను ఇంటింటికి తీసుకెళ్తామని సోమనాథ్ భారతి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతం కట్టించాలని ఆప్ డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం పోరాటం
రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను అన్యాయంగా విధుల నుంచి బహిష్కరించిందని ఆప్ నేత సోమనాథ్ భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పటివరకు మాట్లాడలేదని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం ఆమ్ ఆద్మీ పోరాటం చేస్తోందని తెలిపారు. కేంద్రం ఇస్తున్న నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్దృతం చేస్తామని ఆప్ నేత సోమనాథ్ భారతి తెలిపారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టనున్న పాదయాత్ర ప్రారంభం కాగానే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు.