మోస్ట్ వాంటెడ్స్: సినిమా తీయాలన్న మోజు, చోరీలతో నిర్మాతగా మారేందుకు దిమ్మతిరిగే స్కెచ్!
హైదరాబాద్: ఒకప్పుడు సినీ తారలకు కారు డ్రైవరుగా పనిచేసిన అతను.. ఎలాగైనా తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనుకున్నాడు. తన ఆహార్యం సరిగా లేనందునా.. హీరోకి బదులు నిర్మాత అవాలనుకున్నాడు. అవాలనుకున్నాడు సరే, మరి సినిమా తీసేంత డబ్బు ఎక్కడిది?. అందుకే దొంగ అవతారం ఎత్తాడు. ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఘరానా చోరీలకు పాల్పడ్డాడు. ఆ డబ్బుతో సినిమా తీయాలనేది అతని కల. మరి ఆ కల నెరవేరిందా?..

ఎవరీ వ్యక్తి:
తమిళనాడు తిరువారూరుకు చెందిన బాలమురుగన్(48) కాంచీపురం త్రికాలకుండ్రంలోని పుంజేరి పట్టణంలో నివసించేవాడు. గతంలో సినీ తారల వద్ద డ్రైవరుగా పనిచేశాడు. అప్పటినుంచే ఇండస్ట్రీలోకి ప్రవేశించాలన్న కోరిక బలంగా పాతుకుపోయింది. అయితే హీరో పాత్రలకు తన ఆహార్యం సరిపోదు కాబట్టి నిర్మాత కావాలనుకున్నాడు. అందుకోసం చోరీల బాట పట్టాడు. అదే క్రమంలో తిరునల్వేలి కడయంకు చెందిన దినకరన్(25)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు కలిసి చోరీలు మొదలుపెట్టారు.

'సినిమా' కోసం చోరీల బాట:
బాలమురుగన్, దినకరన్ ఇద్దరు కలిసి మూడేళ్ల పాటు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ, మాదివాలా, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, కోరమంగళ, జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 20చోరీలకు పాల్పడ్డారు. 2011లో చోరీ చేస్తూ పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆపై బెయిల్పై బయటకొచ్చి మకాంను హైదరాబాద్ మార్చేశారు. తనతో వస్తే హీరో చేస్తానని నమ్మించి మేనల్లుడు సురేశ్(24)ను కూడా తన ముఠాలో చేర్చుకున్నారు. ఇదే క్రమంలో శంషాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 'బాలమురుగన్ ప్రొడక్షన్' పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు.

గ్రామీణ బ్యాంకులే టార్గెట్:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో ఈ ముఠా పలు గ్రామీణ బ్యాంకుల్లో చోరీలకు పాల్పడింది. ఘట్ కేసర్ జోడిమెట్లలో దక్కన్ గ్రామీణ బ్యాంకులో రూ.36లక్షల నగదు, 18 తులాల బంగారం చోరీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ గ్రామీణ బ్యాంకులో రూ.4కోట్ల విలువైన బంగారం, రూ.13లక్షల నగదు, చిత్తూరు జిల్లా వరదాయపాళెంలో రూ.55లక్షల విలువైన ఆభరణాలు చోరీ చేశారు. 2014 అగస్టు నుంచి నవంబర్ వరకు ఈ చోరీలు చేసినట్టు సమాచారం.

ఓ సినిమా మొదలుపెట్టారు కూడా..:
చోరీ చేసిన డబ్బుతో రూ.50లక్షల బడ్జెట్ తో 'మనసా వినవే' అనే సినిమా మొదలుపెట్టింది ఈ గ్యాంగ్. కొద్దిరోజులు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కూడా చేసినప్పటికీ.. సినిమాను పూర్తి చేయలేదు. ఆ తర్వాత 'ఆత్మ' పేరుతో మరో సినిమాకు ప్లాన్ చేస్తుండగానే వీరి బాగోతం బయటపడింది.
ఇబ్రహీంపట్నం హెచ్డీసీసీ బ్యాంకులో చోరీకి యత్నించిన సమయంలో.. ఇన్నోవా వాహనాన్ని అక్కడే వదిలి పరారైంది ముఠా. అప్పటినుంచి ఈ ముఠా కోసం గాలిస్తున్న తెలంగాణ పోలీసులు.. ఎట్టకేలకు వీరి ఆచూకీ కనిపెట్టారు. కర్ణాటకలోని పుంజేరీలో ఈ ముఠా ఉంటున్న గుర్తించారు.

ఎట్టకేలకు మరో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ అరెస్ట్..:
ఎట్టకేలకు 2015 అక్టోబర్ 20న తిరువారూరులో మురుగన్ పోలీసులకు చిక్కాడు. అప్పటికే అతను ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించారు. అయినప్పటికీ చోరీలు మానలేదని నిర్దారించారు. ప్రొడక్షన్ వారెంటుపై మురుగన్ ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ సమయంలో అతని వద్ద నుంచి రూ.1.72కోట్ల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
మిగతా ముఠా సభ్యులు అప్పట్లో పోలీసులకు చిక్కలేదు. తాజాగా చెన్నై పోలీసులకు కమల్ కన్నన్, గోపాల్ అనే ముఠా సభ్యులు చిక్కడంతో ఈ వ్యవహారం మరోసారి తెర పైకి వ్చింది. చెన్నైలోని పలుచోట్ల దాదాపు 17ఇళ్లల్లో వీరు చోరీలకు పాల్పడ్డట్టు గుర్తించారు. మురుగన్ తో లింకులు బయటపడటంతో వీరంతా ఒకే గ్యాంగ్ అని తేలింది.












Click it and Unblock the Notifications