కాంగ్రెస్ దాసోజు శ్రవణ్ కు ఖైరతాబాద్ అందుకే ఇచ్చిందా..? అసలు రహస్యం ఏంటి..?
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో తక్కువ సమయంలో ఎక్కువ ఎదిగిన నేత దాసోజు శ్రవణ్. తక్కువ కాలంలోనే అదికార ప్రతినిధి పదవి చేపట్టిన ఆయన ఎమ్మెల్యే సీటు సొంతం చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. అదికూడా ఆయన కోరుకున్న స్థానాన్ని అదిష్టనం ఇవ్వడం పెద్దయెత్తున చర్చనీయాంశంగా మారింది. స్థానికేతరుడు ఐనప్పటికి శ్రవన్ ప్రతిపాదించగానే అదిష్టానం ఖైరతాబాద్ టికెట్ కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన ఉద్దండులకే సరైన సమయంలో అనుకున్న గుర్తింపు రావడం కష్టం. అలాంటిది శ్రవణ్ కోరుకున్న వెంటనే జంటనగరాల్లో కీలకమైన ఖైరతాబాద్ టికెట్ కేటాయించడం వెనక మతలబేంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
కాంగ్రెస్ లో చురుకైన పాత్ర పోషించిన శ్రవణ్..! అందుకు ఎమ్మెల్యే సీటు..!!
ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్కు అసెంబ్లీ టికెట్ ఖరారైంది. అదికూడా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కడం విశేషం. చివరి దాకా ఈ స్థానంలో పోటీపై ఉత్కంఠ నెలకొంది. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రవణ్ కు టికెట్ వస్తుందా రాదా అనే సస్పెన్స్ కు తెరపడినట్లయ్యింది.
టీఆర్ఎస్ లో అవమానాలు..! అందుకే కాంగ్రెస్ లోకి..!!తన మార్క్ చూపించిన శ్రవణ్.!!
శ్రవణ్ కు రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోవడంతో గతంలో టిఆర్ఎస్ అవమానించిందనే వార్తలు వినిపించాయి. గత ఎన్నికల్లో దాసోజు టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ విషయం కూడా తెలిసిందే. అందుకే ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. అయితే కాంగ్రెస్లో కూడా ఆయనకు కుల బలం సమస్య ఎదురయిందని చర్చ జరిగింది. అయినప్పటికీ ఆయన వేరే పార్టీలోకి వెళ్లకుండా, కాంగ్రెస్ ను అంటిపెట్టుకునే ఉన్నారు.
తక్కువ సమయంలో అన్నీ తానై నడిపించిన శ్రవణ్..! అందుకు తగిన గుర్తింపునిచ్చిన కాంగ్రెస్..!!
స్థానిక నేతలు కాకపోయినా ఢిల్లీ పెద్దల నుంచి గుర్తింపు దక్కాలని కోరుకుంటూ పార్టీలో నిజాయితీగా కష్టపడ్డారనే పేరు సంపాదించుకున్నారు. ఆయన భావించినట్టే ఆయనను ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. దీనికితోడు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే నైఫుణ్యాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఇవే రాజకీయ నాయకునికి ఉండాల్సిన కీలక లక్షణాలుగా గుర్తించిన డిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆయకు అవకాశం కల్పించారని తెలుస్తోంది. దాసోజు పై కేంద్ర కాంగ్రెస్ అభిప్రాయం రాష్ట్ర నాయకులు కూడా కాదనలేకపోయవారని తెలుస్తోంది. దీనికితోడు టిఆర్ఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టేలా కాంగ్రెస్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు దాసోజు రూపొందించి అధిష్టానం మెప్పుపొందారని తెలుస్తోంది.
ఖైరతాబాద్ కు కొత్త..! ఐనా గెలుస్థానంటున్న శ్రవణ్..!!
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజక్టుల మీద చెబుతున్నవన్నీ తప్పు అని ఆయన రుజువు చేయగలిగారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ఇలా కాంగ్రెస్ తరపున టిఆర్ఎస్ కు తగిన కౌంటర్ ఇస్తూ దాసోజు ముందుకు సాగారని ప్రచారం ఉంది. దీనికితోడు బిసిలు, దళిత నేతలు టిఆర్ఎస్ తో పాటు కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసేందుకు భయపడుతారనే వాదన వినిపిస్తుంటుంది. దీనికి శ్రవణ్ అధిగమించారని చెబుతుంటారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ దాసోజుకు టిక్కెట్ ఇచ్చి సముచిత గుర్తింపు ఇచ్చిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.