కాళీమందిర్ ల్యాండ్ కబ్జా: ఉప్పుగూడలో ఉద్రిక్తత, పీఎస్కు బండి సంజయ్, రాజా సింగ్ వార్నింగ్
హైదరాబాద్: నగరంలోని ఉప్పుగూడలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. . కాళీమాత ఆలయ భూమిని కబ్జా చేసేందుకు ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని స్థానికులతో కలిసి బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వాళ్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దబీర్పురా పోలీస్ స్టేషన్కు తరలించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. బీజేపీ నేతలకు మద్దతుగా దబీర్పురా పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
డబీర్పురా పీఎస్ కు బండి సంజయ్..
విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఉప్పుగూడ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఆ తర్వాత డబీర్ పురా స్టేషన్కు వెళ్లేందుకు అనుమతించారు. దబీర్ పురా స్టేషన్కు వెళ్లిన బండి సంజయ్.. అక్కడ నేతలు, కార్యకర్తలను పరామర్శించారు.
బండి సంజయ్ రాకతో పోలీసుల మోహరింపు..
బండి సంజయ్ రాకతో స్టేషన్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఖాళీ మందిర్ కబ్జా చేసే కుట్ర: రాజా సింగ్
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు ఖాళీ మాత ఆలయాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని అన్నారు. గతంలో 3 సార్లు వేలం వేయడానికి ప్రయత్నం చేస్తే స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. 8 ఎకరాల స్థలం, గజం 30 వేల వరకు ఉంటుందన్నారు. కానీ, ఇప్పుడు నర్సింహారెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని తెలిపారు.
ఎండోమెంట్ మినిస్టర్ ఏసీలో పడుకున్నారా?
దేవాదాయ శాఖ అధికారులు కోర్టుకు హాజరు కాలేదు. అయితే, దేవాలయ భూములు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రి ఏసీలో పడుకున్నారా? అని మండిపడ్డారు.
Recommended Video
సీఎంకు రాజా సింగ్ హెచ్చరిక
సీఎం.. ఎంఐఎంతో పోతే గ్రేటర్ ప్రజలు ఏమి చేవారో చూశారు కదా.. వాళ్లతో వెళితే మీరు సర్వనాశనం కావడం ఖాయమని హెచ్చరించారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీ ఛార్జీ చేశారని.. ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ రాజా సింగ్ నిలదీశారు.