అందుకే చేరుతున్నా: 'జగన్కు ఆంధ్రా ముఖ్యమైతే నాకు తెలంగాణ ముఖ్యం'
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ దీక్ష చేపట్టడాన్ని వ్యతిరేకించే తాను పార్టీని వీడినట్లు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో కేసీఆర్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పొంగులేటి తెలంగాణ ప్రాజెక్టల పట్ల వైయస్ జగన్ నిరసనపై ధ్వజమెత్తారు. జగన్కు ఆంధ్రా ముఖ్యమైతే తనకు తెలంగాణ ముఖ్యమని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల స్వప్రయోజనాల కోసం మీరు దీక్ష చేపడితే.. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్లో చేరడం తప్పు లేదన్నారు.
జగన్ ఏపీ ప్రజల పక్షాన పోరాడే విషయంలో న్యాయం ఉంది కానీ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తాను తట్టుకోలేకపోయానన్నారు. జగన్ వైఖరికి నిరసనగా వైసీపీకి తాను పాయం వెంకటేశ్వర్లుతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజీనామా చేశామని గుర్తు చేశారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మెచ్చే తాము టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. బంగారు తెలంగాణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు.
తెలంగాణను మాగాణం చేయాలనే సంకల్పంతో ఉన్న సీఎం కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్రావు, కేటీఆర్ గొప్ప పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. బుల్లెట్ లాంటి లీడర్ కేటీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోవడం సంతోషకరంగా ఉందన్నారు.
అనుకున్న సమయంలోగా మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందనే ప్రగాఢ విశ్వాసం తనకు ఉందన్నారు. మిషన్ కాకతీయ పనుల విషయంలో పారదర్శకంగా పని చేస్తున్న హరీష్రావును అభినందిస్తున్నానని చెప్పారు.
కేసీఆర్ సూచనలను క్రమం తప్పకుండా ప్రభుత్వం, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. పాలనలో తెలంగాణలో కేసీఆర్ను మించిన వారెవ్వరూ లేరని అన్నారు. ఈనెల 16న జరిగే పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
సీఎంగా కేసీఆర్ మా అదృష్టం: పాయం వెంకటేశ్వర్లు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉండటం తమ అదృష్టమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో బుధవారం ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిని చూసి ఆంధ్రా పార్టీలు ఓర్వలేక పోతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ ముందుకెళ్తుంటే ఆంధ్రా పార్టీలు ఓర్వలేక పోతున్నాయని అన్నారు. కోటి ఎకరాలకు నీరందించి బంగారు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తుంటే ఆంధ్రా నేతలు కుట్రలు, కుతంత్రాలు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రా పార్టీల కుట్రలను తిప్పి కొట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రాజెక్టులు కడుతుంటే ఏపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్నలను పొందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనకు పాటుపడుతామని స్పష్టం చేశారు.