జగన్కు మరో దెబ్బ: టీఆర్ఎస్లోకి ఖమ్మం ఎంపీ పొంగులేటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వలసలతో సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా మరో పెద్ద షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే.
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు చేరడంపై అధినేత వైయస్ జగన్ సైతం చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తాజాగా తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా త్వరంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
దీనికి సంబంధించి వైసీపీ పార్టీకి చెందిన నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎప్పటి నుంచో మంచి సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఈ సాన్నిహిత్యమే ఆయన్ని టీఆర్ఎస్ పార్టీలోకి చేరేలా చేసిందని అంటున్నారు.
అంతేకాదు వైసీపీలో ఉంటూ తన పార్లమెంట్ స్థానంలోని పనులను చక్కబెట్టకోవడం కూడా కాస్తంత ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వరంగల్, ఖమ్మంలో కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల అనంతరం ఆయన గులాబీ కండువా కప్పుకోవచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవగా అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కే ఓటు వేశారు.