ఖమ్మంలో వైఎస్ షర్మిల బహిరంగ సభకు పోలీసుల గ్రీన్ సిగ్నల్... కండిషన్స్ ఇవే...
తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న వైఎస్ షర్మిల.. ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వేదిక నుంచి ఆమె పార్టీ ప్రస్థానాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ బహిరంగ సభకు బుధవారం(మార్చి 24) పోలీసులు అనుమతినిచ్చారు. ఖమ్మం జిల్లా వైసీపీ అధ్యక్షుడు లక్కినేని సధీర్ సభకు అనుమతులు కోరుతూ పోలీసులకు వినతిపత్రం అందజేయగా... అందుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించాలని పోలీసులు సూచించారు. ఏప్రిల్ 9న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెవిలియన్ గ్రౌండ్లో 5వేల నుంచి 6 వేల మందితో సభ నిర్వహించుకోవచ్చునని తెలిపారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. అలాగే ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని, పరిమితికి మించి కార్యకర్తలు రావొద్దని, సభా సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ మించవద్దని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల్లో పోటీచేస్తానని బుధవారం(మార్చి 24) షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్కు పులివెందుల ఎలాగో...తనకు పాలేరు అలాగేనని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తమ ప్రభంజనాన్ని ఆపలేరన్నారు. కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్,ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తదితర నేతలు ఇప్పటికే షర్మిల పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ కోడలిగా ఇక్కడ రాజకీయం చేసే హక్కు తనకు ఉందని షర్మిల చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో వైఎస్ అభిమానులను,మద్దతుదారులను కలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం సభలో పార్టీ పేరు,ఎజెండా,కార్యాచరణను షర్మిల ఖరారు చేసే అవకాశం ఉంది.
వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతుండటంతో ప్రత్యర్థుల నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ కోడలినని చెప్పి రాజకీయాలు చేస్తానంటున్న వైఎస్ షర్మిల ముందు పోలవరంపై అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలిపారన్న గంగుల... వైఎస్ షర్మిల పాదయాత్రను అక్కడి నుంచి ప్రారంభించి ఆ మండలాలను తిరిగి తెలంగాణలో కలిపాకే రాజకీయ పార్టీ పెట్టాలన్నారు.