డేకేర్ సెంటర్ నిర్లక్ష్యం: బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది
హైదరాబాద్: డే కేర్ సెంటర్ల నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. నగరంలోని మధురానగర్ లారెల్ ప్రీ స్కూల్ డేకేర్ సెంటర్లో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ రెండేళ్ల బాలుడు టార్పెంట్ ఆయిల్ తాగి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.
ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగుచూసింది. కాకినాడకు చెందిన రమణి, నవీన్ కుమార్ దంపతులు నగరంలోని మధురానగర్లో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
రెండేళ్ల వయసున్న తమ కుమారుడ్ని స్థానిక డే కేర్ సెంటర్లో చేర్పించారు. డేకేర్కు వెళ్లిన బాలుడు టార్పెంట్ ఆయిల్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.
వైద్యానికయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తొలుత సెంటర్ యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే, వైద్యానికి రూ.47లక్షలు ఖర్చవడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.