సమాచారం కష్టంగా ఉంది, కానీ తెలుగు ప్రొఫెసర్లు క్షేమం: సుష్మా
న్యూఢిల్లీ: లిబియాలో భారత రాయబార కార్యాలయం లేకపోవడంతో కిడ్నాపైన ఫ్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం సమాచారం తెలుసుకోవడం ఇబ్బందిగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. లిబియాలో అస్థిర ప్రభుత్వం ఉండడం కూడా అందుకు మరో కారణమని ఆమె అన్నారు.
బందీలు సురక్షితంగా ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. 12 రోజులుగా లిబియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆమె తెలిపారు. త్వరలోనే వారిని ఇండియాకు తీసుకొస్తామని సుష్మా హామీ ఇచ్చారు. ఫ్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని వారి బంధువులకు సుష్మా భరోసానిచ్చారు.
ఇదిలావుంటే, లిబియాలో ఉగ్రవాదుల అపహరణకు గురైన తెలుగువారు గోపీకృష్ణ, బలరాం కుటుంబసభ్యులు ప్రధాని నరేంద్ర మోడీని సోమవారం కలిశారు. తెలుగుదేశం ఎంపీలు మల్లారెడ్డి, రామ్మోహన్నాయుడు నేతృత్వంలో వారు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్తో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటానని ప్రధాని వారికి చెప్పారు.
ఉగ్రవాదుల చెర నుంచి గోపీకృష్ణ, బలరాంను విడిపించేందుకు కృషి చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా వారు కలిశారు. ఉగ్రవాదుల నుంచి తమ వారిని వీలైనంత త్వరగా విడిపిచేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.