రివర్స్ గేర్: అందుకే గెలుపు.. కెసిఆర్కు కిరణ్ కుమార్ రెడ్డి పొగడ్తలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తున్నారట. తెలంగాణలో సీఎం కెసిఆర్ లా అండ్ ఆర్డర్ను బాగా మెయింటేన్ చేస్తున్నారని కితాబిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం వస్తే శాంతిభద్రతలు దెబ్బతింటాయని, తెలంగాణలో విద్యుత్ కొరత వస్తుందని రాష్ట్ర విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇవి విషయాలను ప్రస్తావిస్తూ, ప్రధానంగా తెలంగాణ అంధకారంలో మునిగిపోతుందన్న కిరణ్ రెడ్డి వ్యాఖ్యలను టిఆర్ఎస్ నేతలు పదేపదే ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ వస్తే విద్యుత్ కొరత ఏర్పడుతుందని కిరణ్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు గతంలో కంటే మెరుగైన విద్యుత్ ఇస్తున్నామని, సమైక్య రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు చేసిన రోజులు ఉన్నాయని, కానీ పరిశ్రమలకు, ఇంటి అవసరాలకు తాము నిత్యం విద్యుత్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ సహా టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఓ వైపు టిఆర్ఎస్ నేతలు తనను విమర్శిస్తున్న సమయంలో, కిరణ్ రెడ్డి మాత్రం కెసిఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో పని చేసిన ఓ మాజీ మంత్రితో కిరణ్ రెడ్డి.. కెసిఆర్ పైన ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది.
ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు, ఉప ఎన్నికల్లో తెరాస విజయంపై కిరణ్ రెడ్డి స్పందిస్తూ... కెసిఆర్ బాగా పాలిస్తాడని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే గ్రేటర్లో గెలిపించారని, కెసిఆర్ లా అండ్ ఆర్డర్ బాగా మెయింటేన్ చేస్తున్నారని కితాబిచ్చినట్లుగా తెలుస్తోంది. కెసిఆర్ పాలన పట్ల అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారని తెలుస్తోంది.