కిషన్ రెడ్డి, ఈటల ర్యాలీని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, ఘర్షణ: పోలీస్పై చేయి చేసుకున్నారు!
హైదరాబాద్: ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ హుజూరాబాద్లో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఇప్పటి వరకు మాటల యుద్ధం జరగ్గా.. ఇప్పుడు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో బీజేపీ ర్యాలీని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
కిషన్, ఈటల ర్యాలీని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుపై చేయి
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ర్యాలీని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. దీంతో బీజేపీ శ్రేణులు వారిని ప్రతిఘటించాయి. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుని ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. కాగా, ఓ టీఆర్ఎస్ కార్యకర్త రెచ్చిపోయి పోలీసు అధికారి కాలర్ పట్టుకున్నాడు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
టీఆర్ఎస్ శ్రేణుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం..
టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా తాను వస్తే రక్షణ కల్పించే తీరు ఇదేనా? అని మండిపడ్డారు. తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.
ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటూ బండి సంజయ్ ఫైర్
పక్కా ప్లాన్ ప్రకారమే ఇల్లెందుకుంటలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నామన్నారు. కిషన్ రెడ్డిపై దాడి కేసీఆర్ డైరెక్షన్లోనే జరిగిందన్నారు. టీఆర్ఎస్ ఏం చేసినా హుజురాబాద్ లో గెలవలేదన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ కు క్యాడర్ లేదన్నారు. సర్వేలన్నీ హుజురాబాద్లో బీజేపీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే ఓర్వలేక టీఆర్ఎస్ నాయకులు బీజేపీపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది ఎవరో విచారణ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్రమంత్రిపై దాడిపై సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డిపై దాడికి నిరసనగా (శనివారం) నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.
Recommended Video
ఈటలను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు
ఈటల రాజేందర్తోపాటు ఇల్లందకుంట మండలంలో ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం డబ్బును మాత్రమే నమ్ముకుని కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. సీఎం కుర్చీ తనకు ఎడమకాలి చెప్పుతో సమానమని గతంలో చెప్పిన కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టాడని విమర్శించారు. హుజురాబాద్లో ఈటల రాజేందర్ ను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఇంతటి అధికార దుర్వినియోగాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అని... అలాంటి పార్టీతో బీజేపీకి పొత్తు ఎప్పుడూ ఉండదని చెప్పారు. దళితబంధు ఆపేయించారని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలైన తెల్లారి అందరికీ దళితబంధు ఇవ్వాలని సవాల్ చేశారు.